తెలుగుదేశం పార్టీలో సీట్ల కేటాయింపు ఇంకా పూర్తికాలేదు.ఇప్పటికే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించినా కొన్ని చోట్ల ఇంకా అభ్యర్థుల ఎంపిక పూర్తికాకపోవడం అక్కడ అనేక వివాదాలు మొదలవ్వడంతో సీట్ల కేటాయింపు పెద్ద సమస్యగా మారింది.
చాలా కాలంగా ఈ సీట్ల విషయంలో సమీక్షలు చేస్తున్నా ఈ విషయంలో క్లారిటీ రావడంలేదు.ఒకవైపున చూస్తే నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది.
కానీ ముప్పైకి పైగా సీట్ల విషయంలో పీట ముడి వీడలేదు.ఈ ఎన్నికల్లో టీడీపీ చాలావరకు సిట్టింగ్ లకే సీట్లు కేటాయించింది.
సర్వేల్లో వెనుకంజలో ఉన్న సిట్టింగ్ లను తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించేందుకు చూస్తోంది.
తెలుగుదేశం పార్టీకి ఆ సీట్లలో చాలా పంచాయితీలు ఉన్నాయి.అభ్యర్థిత్వాల విషయంలో అభ్యంతరాలు తీవ్రంగా ఉన్నాయి.అందుకే చంద్రబాబు నాయుడు వాటిల్లో అభ్యర్థులను తేల్చలేకపోతూ ఉన్నారు.
అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రకటనలు చేయలేకపోతున్నారు.కానీ ఈ విషయంలో వైసీపీ అందరికంటే ముందుగానే ఉంది.
ఇప్పటికే మొత్తం అభ్యర్థుల లిస్ట్ ప్రకటించి మిగతా అన్ని పార్టీలకంటే ముందుగానే ఉంది.నామినేషన్ల ప్రక్రియకు మొత్తం ఎనిమిది రోజుల సమయం ఉంది.
అందులో రెండు మూడు రోజులు ప్రభుత్వ సెలవులు ఉన్నాయని తెలుస్తోంది.అంటే కేవలం ఐదు రోజులు మాత్రమే నామినేషన్లకు అవకాశం ఉన్నట్టు అందులో కూడా ముహూర్తాలు, జాతకాలు కూడా సరిచూసుకుని సమయం కూడా కావాలి.
ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం అధినేత ఇంకా తుది జాబితాను విడుదల చేయకపోవడం తో ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు అనే వాదన తెరపైకి వస్తోంది.తుది జాబితా విడుదల చేయడం పెద్ద సమస్య కాదు, విడుదల చేశాక ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది తేలాల్సి ఉంది.ఇంకా అభ్యర్థులను ప్రకటించని చోట ఇద్దరు ముగ్గురు నాయకులు పోటీ పడుతుండడం అక్కడ అనేక వివాదాలు చోటు చేసుకోవడంతో మరోసారి ఆయా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య సమన్వయం చేసి అందరికి ఆమోదగ్యమైన వ్యక్తిని ఎంపిక చేయాలనే భావనలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది.