వైసీపీ ప్రభుత్వం ఏపీలో కొలువుతీరి రెండు నెలలు గడుస్తున్నా తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా ఓటమి నుంచి తేరుకోలేకపోతోంది.ఏపీ కి చేయాల్సిన అభివృద్ధి అంతా చేసినా ఎక్కడ తేడా కొట్టింది అనే విషయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలుసుకునేందుకు అనేక సమావేశాలు, పార్టీ కీలక నాయకులతో మీటింగు లు పెడుతున్నాడు.
అంతే కాదు 175 సీట్లకు గాను 23 సీట్లు సాధించే అంత తప్పు నేను ఏమి చేసాను అంటూ ప్రజలను కూడా ప్రస్తున్నాడు.తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఇదే విషయంపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమికి బిసిలు దూరమవ్వటమే ప్రధాన కారణంగా చాలామంది నాయకులు అభిప్రాయపడ్డారు.
అంతే కాదు మన పార్టీ బిసిలు, ఎస్సీల్లో మాదిగలను అనవసరంగా దూరం చేసుకుందని కొంతమంది నాయకులూ అధినేత చంద్రబాబు తో చెప్పారు.వారి ప్రాధాన్యతను ముందుచూపుతో పసిగట్టకపోవడం వల్లనే వైసీపీ వారికి దగ్గరయ్యిందని అభిప్రాయపడ్డారు.
అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ పార్టీగా ప్రజల్లో గుర్తింపు ఉంది.ఎన్టీఆర్ టిడిపిని స్థాపించినప్పటి నుంచి బీసీల సంపూర్ణ మద్దతును పార్టీకి అందిస్తున్నారు.అటువంటిది మొదటిసారిగా బిసిల్లోని కొన్ని ఉపకులాలు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు.అలాగని బిసిల్లోని అన్నీ ఉపకులాలు సంపూర్ణంగా వైసిపికి మద్దతుగా నిలబడలేదు.కొన్ని ఉపకులాల్లోని ఓటర్లు మాత్రమే టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో వైసీపీ కి కలిసివచ్చింది.అదేగనుక చంద్రబాబు దెబ్బకు బిసిల్లోని అన్నీ ఉపకులాలు పూర్తిగా జగన్ కు మద్దతుగా నిలబడుంటే కుప్పంలో చంద్రబాబు గెలుపు కూడా అనుమానంగానే ఉండేది.
ఉపకులాల్లోని వివిధ సంఘాల్లోని నేతలు చంద్రబాబును కలిసి తమ సమస్యలను చెప్పుకునే సమయంలో జరిగిన గొడవలే టిడిపికి చేటు తెచ్చాయని పార్టీ నాయకులు కొంతమంది గుర్తుచేస్తున్నారు.
ముఖ్యంగా కుల సంఘాల నాయకులతో చంద్రబాబు వ్యవహరించిన తీరు కూడా బాలేదని, వారి వారి సమస్యలను చెప్పుకునేందుకు వస్తే సానుకూలంగా వినడం మానేసి వారు హార్ట్ అయ్యే విధంగా వ్యవహరించారని అంతే కాకుండా ఆయా సంఘాల నాయకులను అరెస్టులు చేయిస్తానని, తోకలు కట్ చేస్తానని, అసలు సచివాలయంలోకి ఎవరు రానిచ్చారంటూ బహిరంగంగానే వాళ్ళపై చాలాసార్లు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆయా కుల సంఘాల నాయకులు తమ సామజిక వర్గాలతో మీటింగ్ పెట్టి టీడీపీ కి ఎవరూ ఓటు వేయొద్దంటూ తీర్మానాలు కూడా చేసుకున్నారు.ఇటువంటి కొన్ని కొన్ని కారణాలతో టీడీపీకి సాంప్రదాయక ఓటర్లు గా ఉన్న బీసీలు క్రమ క్రమంగా దూరం అయ్యారు.ఇవే విషయాలను టీడీపీ పొలిట్ బ్యూరోలో చంద్రబాబు తో పార్టీ నాయకులు నిర్మొహమాటంగా చెప్పినట్టు తెలుస్తోంది.
అయితే ఇవన్నీ నిజమేనని, ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది ఇకపై జరగాల్సింది చూద్దాం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు సమాచారం.