దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.గతంలో ఎన్నడూ లేనివిధంగా టిడిపిలో సంక్షోభం తలెత్తడం, యువ నాయకుడు సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆ పార్టీలో యూత్ లీడర్ ల సంఖ్య ఎక్కువగా ఉండటం తదితర కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ అవుట్ డేటెడ్ పార్టీగా ముద్ర పడిపోయింది.
దీనికి తగ్గట్టుగా పార్టీలో సీనియర్, వృద్ధ నాయకుల పెత్తనమే ఎక్కువగా ఉండడంతో టిడిపిని యూత్ పెద్దగా ఆదరించిలేకపోతున్నారు.తన అనుభవాన్ని అంతా వాడుకొని మరి పార్టీకి మైలేజ్ తీసుకురావాలని బాబు ఈ వయస్సులో కూడా గట్టిగానే కష్టపడుతున్నాడు.
అయినా పార్టీలో చురుకైన యువకులకు ప్రాధాన్యం లేక బాబు కష్టానికి పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.
ఈ బాధ బాబు లో ఎక్కువగా ఉంది.ఇప్పటికే పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి బయటకు వెళ్లిపోగా మరికొందరు మాత్రం సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.ఎమ్మెల్సీలు అయితే ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తూ పార్టీ మరింత సంక్షోభంలో ఉందన్న సంకేతాలను బయటకు తెలియజేస్తున్నారు.
ఇక తాను రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం దగ్గర్లో ఉండడంతో చంద్రబాబు లోకేష్ ను బలమైన నాయకుడిగా తయారు చేసేందుకు ఆపసోపాలు పడుతున్నాడు.అందుకే పార్టీలో యువ రక్తం ఎక్కించకపోతే పార్టీ భవిష్యత్తు దెబ్బతింటుందని, దీనికి తోడు లోకేష్ కు అన్ని విధాల సహకరించే నాయకులు అవసరం అవుతారని బాబు ఆలోచన కి వచ్చాడు.
దీనిలో భాగంగానే ఏపీ లో ఉన్న బలమైన యూత్ లీడర్లను గుర్తించే పనిలో చంద్రబాబు ఉన్నాడు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి పార్టీ పదవులు వరకు అన్నింటిలోనూ యువతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని బాబు భావిస్తున్నారు.ఈ మేరకు సమర్థులైన యువ నాయకులను గుర్తించాల్సిందిగా పార్టీ సీనియర్లకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.టీడీపీలో యువత హవా పెరిగితే ఇక పాతతరం నేతలు తెర వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.