మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపొయింది ఏపీలో టీడీపీ పని.ఇప్పటికే అతి తక్కువ స్థానాల్లో గెలుపొందేమే అన్న బాధ ఆ పార్టీ అధినేత చంద్రబాబు లో ఎక్కువ కనిపిస్తోంది.
తనతో పాటు గెలిచిన 22 మందితో ఈ ఐదేళ్లు ఏదోలా నెట్టుకొద్దామంటే తమ రాజకీయ ప్రత్యర్థి వైసీపీ బాంబుల మీద బాంబులు పేల్చుతోంది.తాను కనుక ఒకే అంటే టీడీపీలో గెలిచిన ఎమ్యెల్యేలు ఎవరూ మిగలరని అంతా వైసీపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని జగన్ బాబు గుండెల్లో బాంబు పేల్చారు.
అయితే తాను మిగతా పార్టీల్లా అలా చేయదలుచుకోలేదని జగన్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం టీడీపీ నుంచి ఎవరు వచ్చి చేరుతామన్నా వారు వారి పార్టీకి , పదవులకు రాజీనామా చేసి ఆ తరువాత మాత్రమే వారిని తమ పార్టీలో చేర్చుకుంటాను అంటూ జగన్ ఖరాఖండిగా చెప్పేస్తున్నారు.
టీడీపీకి చెందిన ఎమ్యెల్యేలు ఇప్పటికీ తమ పార్టీ నాయకులతో టచ్ లో ఉన్నారని, తాను మంత్రి పదవులు ఇస్తామని పిలుస్తే టీడీపీలో ఒక్క నేత కూడా మిగిలే వారు కాదని చెప్పారు.అయితే జగన్ చెప్పిన ఈ అంశాన్ని టీడీపీ సీరియస్ గా తీసుకుంది.వైసీపీతో టచ్లో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ఎవరా అనే విషయం చంద్రబాబుకు నిద్రపట్టనివ్వడం లేదు.23 మంది ఎమ్మెల్యేల్లో ఎవరెవరు వైసీపీకి టచ్లోకి వెళ్లారో తెలుసుకోవాల్సిందిగా బాబు కొంతమందికి బాధ్యత అప్పగించాడట.ఇప్పటివరకు ఎవరెవరు వైసీపీ పెద్దలను కలిశారు? ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నారో తెలుసుకోవాలని తన తమ పార్టీ సీనియర్ నాయకులకు బాబు ఆదేశాలు జారీ చేశారు.
జగన్ చెప్పిన లెక్క ప్రకారం ఇప్పటివరకు టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే అసెంబ్లీలో అచ్చెన్నాయుడు ఒక్కడే కొంత యాక్టివ్గా ఉన్నారు.మిగతా ఎమ్మెల్యేలు అంతగా దూకుడు కనబర్చడంలేదు.ఇది కూడా బాబు లో అనుమానం బాగా పెంచుతోంది.అంతే కాకుండా టీడీపీకి చెందిన వారు వైసీపీతో పాటు బిజెపీతోనూ సంప్రదింపులు చేస్తున్నారనే విషయం బాబు లో ఆందోళన కలిగిస్తోంది.
అందుకే బీజేపీలో చేరాలనే ఉద్దేశంతో ఎవరెవరు ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారో అనే విషయంపై బాబు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.