మచిలీపట్నంలో ఈ రోజు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చాలా ఆవేదనగా మాట్లాడారు.రాజధాని విషయంలో ప్రభుత్వం అమరావతి ప్రాంత రైతులను ఇబ్బంది పెడుతోందని, మీకు నా మీద కోపం ఉంటే నన్ను బాధపెట్టండి కానీ అమరావతి ప్రాంత ప్రజలను, రైతులను బాధపెట్టవద్దు అంటూ చంద్రబాబు ఆవేదనగా ప్రసంగించారు.
అమరావతి విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూమిని రియల్ ఎస్టేట్ అంటున్నారని, ,రైతులు గుండె ఆగి చనిపోతే మీకు బాధ అనిపించడం లేదా ? కనీసం రైతుల కుటుంబాలను ఇప్పటి వరకు ఎవరూ పరామర్శించ లేదు అంటూ బాబు మండిపడ్డారు.అమరావతి బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటిది అని మీరు అనవసరంగా దాన్నినా మీద ఉన్న కోపంతో వదిలేసుకుంటున్నారని బాబు అన్నారు.మూడు రాజధానులు అంటూ ఏపీలో లేనిపోని గందరగోళం సృష్టించారని, అసలు మిమ్మల్ని మూడు రాజధానులు కావాలని ఎవరు అడిగారని, విశాఖలో రాజధాని పెట్టమని ఆ ప్రాంత ప్రజలు అడిగారా అంటూ నిలదీశారు.
విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారిని వెనక్కి పంపించింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు.బందరు పోర్టుకు సీఎం జగన్ అన్యాయం చేశారని, సీఎం జగన్ పథకాలు నవరత్నాలు కాదు నవగ్రహాలు అంటూ విమర్శించారు.
నా వయస్సు మీద మీ పార్టీ నాయకులంతా కామెంట్స్ చేస్తున్నారని, 151 మంది ఎమ్యెల్యేలు నన్ను చూసి భయపడుతున్నారని బాబు అన్నారు.