ప్రస్తుతం అధికార పార్టీ దూకుడు మీద ఉండడంతో చంద్రబాబు ఆ దూకుడును తగ్గించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బలం అంతంతమాత్రంగానే ఉండడంతో, తమతో కలిసి వచ్చే పార్టీలన్నిటినీ కలుపుకొని ప్రభుత్వం పై పోరాటం చేయాలని బాబు చూస్తున్నాడు.
దీనిలో భాగంగానే అన్ని పార్టీలను ఏకం చేసి తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాడు.ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై టిడిపి సమీక్ష నిర్వహించింది.
అసలు ముందుగా జగన్ పరిపాలనపై ఆరు నెలల వరకు స్పందించ కూడదని టిడిపి నిర్ణయించుకున్నా వైసీపీ దూకుడుతో ఆ నిర్ణయానికి బ్రేక్ వేశారు.ఆరు నెలలు వేచి చూస్తే జగన్ మరింత పాపులర్ అయిపోతాడని, అప్పుడు మనం బాగా వెనుకబడి పోతామనే అభిప్రాయంతోనే వివిధ సమస్యలను ఎంచుకుని పోరాటానికి దిగుతోంది టిడిపి.
తాము ఒంటరిగా ఉద్యమాలు, ప్రజాందోళనలు చేపడితే పెద్దగా ప్రయోజనం ఉండదు అనే విషయాన్ని టిడిపి గ్రహించింది.ఏపీలో ఇసుక కొరత, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం పైన ఈ విధంగానే ఒంటరిగా ఉద్యమించింది.
కానీ అనుకున్న స్థాయిలో మైలేజ్ రాలేదని టిడిపి గ్రహించింది.తాజాగా రాజధాని పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై కొంతమంది చెప్పులు విసరడం ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళన జరగడంతో అది టీడీపీకి సానుభూతిని తీసుకువచ్చిందని బాబు భావిస్తున్నారు.
ప్రస్తుతం అధికార పార్టీ సంఖ్యాపరంగా బలంగా ఉండడంతో ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్దులందరినీ ఏకతాటిపైకి తెచ్చి టీడీపీకి అనుకూలంగా మలుచుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడు.
ఎట్టిపరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్లేందుకు ఇష్టపడడం లేదు.చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టిన తరువాత టిడిపి ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళలేదు.వెళ్లిన ఒక్కసారి కూడా ఎవరూ ఊహించని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది.
అందుకే ఇకపై ఒంటరిగా ఎన్నికల బరిలోకి వెళ్లకుండా ఏదో ఒక పార్టీ అండ చూసుకోవడమే మంచిదన్న ఆలోచనకు చంద్రబాబు వచ్చారు.డిసెంబర్ 9 వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవుతున్నాయి.
ఏపీ రాజధాని అమరావతి విషయాన్ని ఆ సమావేశాల్లో బాగా హైలెట్ చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బాబు చూస్తున్నారు.దీనిలో భాగంగానే డిసెంబర్ ఐదో తేదీన రౌండ్ టేబుల్ సమావేశాన్ని టిడిపి ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో అన్ని పార్టీల నాయకులు, మేధావులు, నిపుణులు హాజరవుతారు.ఈ సందర్భంగా బిజెపి ని కూడా ఆ సమావేశానికి పిలిచి ఆ పార్టీకి దగ్గరవ్వాలని చూస్తున్నాడు.