తెలుగుదేశం పార్టీలో బాలయ్య వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది.గత టిడిపి ప్రభుత్వంలో బాలయ్య తన హవా కనిపించేలా, రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ ఉండేవారు.
కానీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో అప్పటి నుంచి ఆయన మౌనం గానే ఉంటున్నారు.అసెంబ్లీ లో తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు విరుచుకుపడుతున్నా, మౌనంగా ఉంటూ వచ్చారు.
ఇక టిడిపి అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి ఆందోళన కార్యక్రమం జరిగినా బాలయ్య పెద్దగా స్పందించలేదు.దీంతో బాలయ్య వ్యవహారంపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతుండగా, ఇప్పుడు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడైన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో బాలకృష్ణపై టిడిపిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సొంత మనిషి పార్టీ ఫిరాయిస్తున్నా బాలకృష్ణ అడ్డుకోలేక పోయారని, గతంలో తాను పదవులు, సీట్లు ఇప్పించుకున్న నేతలను కూడా బాలయ్య అడ్డుకోలేకపోతున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.ఈ విషయంలో చంద్రబాబు సైతం బాలయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.బాలయ్యకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి అయిన కదిరి బాబురావు కి గతంలో ఎమ్మెల్యే టికెట్ కూడా బాలకృష్ణ సిఫార్సుతో చంద్రబాబు ఇచ్చారు.ప్రస్తుతం టిడిపి అధినేత తీరుపై ఆగ్రహంతో బాబురావు వైసీపీలో చేరారు.
అయితే తాను వైసీపీలో చేరే విషయం ముందుగానే బాలయ్యతో చర్చించి, ఆయన అనుమతి మేరకు వైసీపీలో చేరినట్టుగా బాబురావు తన సన్నిహితుల వద్ద ప్రస్తావించడం, అది కాస్త చంద్రబాబు చెవిన పడడంతో బాబు తీవ్రస్థాయిలో బాలయ్య తీరు పై మండిపడినట్లు తెలుస్తోంది.వైసీపీలోకి బాలయ్య దగ్గరుండి మరీ టిడిపి నాయకులను పంపిస్తున్నారు అని చంద్రబాబు కొంత మంది దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
గతంలో బాలకృష్ణ సహకారంతో ఎఫ్డీఏ చైర్మన్ గా ఉన్న సినీ నిర్మాత ఎమ్మెల్యే అంబికా కృష్ణ బిజెపిలో చేరారు.అయితే ఈ విషయాన్ని బాలకృష్ణకు ముందుగానే సమాచారం ఇచ్చానని, ఆయన అనుమతితోనే బీజేపీలో చేరినట్టుగా అంబికా కృష్ణ తర్వాత ప్రకటించడంతో చంద్రబాబు అప్పట్లోనే అసహనం వ్యక్తం చేశారు.ఇప్పుడు బాబురావు విషయంలోనూ అదే విధంగా చేయడంతో బాలయ్య టీడీపీకి వెన్నుపోటు పొడుస్తున్నారు అని కొంతమంది బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.చంద్రబాబుకు బాలయ్య కు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి అని, బాలయ్య మాటను చంద్రబాబు వినే పరిస్థితిలో లేరని, దీనిపై బాలయ్య కూడా అసహనంతో తన సన్నిహితులను టిడిపిలో ఉన్నా ప్రయోజనం ఉండదనే ఆలోచనతో వేరే పార్టీలో కి పంపుతున్నట్టు కనిపిస్తోంది.
ఒక పక్క పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా అధికార పార్టీలో చేరుతుండడం, ఇప్పుడు తన సొంత మనుషులే వారిని దగ్గరుండి పంపించడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు టిడిపిలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.