ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానం గందరగోళంగా కనిపిస్తోంది.ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు లో ఎక్కడలేని ఆందోళన కనిపిస్తోంది.
దీనికి కారణం కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ, తెలంగాణాలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఇకపై తనకు రాజకీయ వేధింపులు తప్పవనే భయాందోళన బాబులో స్పష్టంగా కనిపిస్తోంది.ముఖ్యంగా ఏపీలో జరిగిన అనేక అవకతవకలపై సీబీఐ విచారణ ఎదుర్కోవడం తప్పదనే ఆందోళన పెరిగిపోతోంది.
అదీ కాకుండా ఏపీలో సీబీఐ ఎంట్రీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సీబీఐ దాడులు చంద్రబాబును ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఆ భయంతోనే గవర్నర్ నరసింహన్ తో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీలో తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో తనను, తన సహచరులను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ కుట్రపూరితంగా సీబీఐని వాడుకుంటుందని రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో విడుదల చేశారు.కానీ ప్రస్తుతం సీఎం జగన్ చంద్రబాబు చేసిన జీవోని రద్దు చేసి సీబీఐ ఏపీలో అడుగుపెట్టేందుకు అవకాశం కల్పించారు.
దీంతో బాబు లో ఆందోళన తీవ్ర స్థాయిలో పెరిగిపోయిందట.గతంలోనే బీజేపీ తనను టార్గెట్ చేయకుండా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ద్వారా చంద్రబాబు రాజీ ప్రయత్నం చేసినా అది వర్కవుట్ అవ్వలేదట.
అయినా బాబు మాత్రం పట్టు వీడకుండా కేంద్రంలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ద్వారా బీజేపీ పెద్దలకు నచ్చచెప్పి రాజీ ప్రయత్నం చేశాడని, కానీ సదరు వ్యక్తి ఎంత నచ్చచెప్పినా బాబు తో రాజీకి ససేమిరా ఒప్పుకోలేదనే వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి.ఇక అన్ని ఆప్షన్స్ అయిపోవడంతో ఆఖరి ప్రయత్రంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ద్వారా రాజీ ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.
తాజాగా బాబు, నరసింహన్ భేటీ దాదాపు ఒకటిన్నర గంటకు పైగా సాగింది.ఈ భేటీలో బాబు బీజేపీతో రాజీపడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తనపై ఎటువంటి రాజకీయ కక్ష తీర్చుకోవద్దని, సీబీఐ విచారణ లేకుండా చూడాలని గవర్నర్ కు మొరపెట్టుకున్నట్టు పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది.