ఏపీ పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఊహించిన స్థానాల కంటే కాస్త ఎక్కువే సంపాదించుకుని ఫర్వాలేదు అనిపించుకుంది.గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకున్న స్థానాలతో పోలిస్తే, ఇప్పుడు టిడిపి కాస్తోకూస్తో పుంజుకుందనే విషయం అర్థమైంది.
అందరూ ఊహించినట్లుగా అధికార పార్టీ వైసిపి పంచాయతీ ఎన్నికలలో సత్తా చాటుకుంది.ఇక ఎన్నికల తంతు మొదలైనప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖలు రాస్తూ, హడావుడి చేస్తూ చంద్రబాబు వచ్చారు.
ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో టిడిపి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది.ఇక్కడ వైసిపికి తిరుగులేని ఆధిక్యత దక్కింది.
కుప్పంలో వైసిపి ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం ద్వారా, ఇక్కడ చంద్రబాబు హవా తగ్గిపోయింది అనే విషయాన్ని వైసిపి హైలెట్ చేసింది.దీంతో చంద్రబాబు పై నిజంగా ప్రజలలో వ్యతిరేకత పెరిగిందనే అభిప్రాయాలూ పెరిగిపోయాయి.
దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది.
రాష్ట్రంలో ఫలితాలు ఎక్కడ ఎలా ఉన్నా కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి అత్యధిక స్థానాలు దక్కుతాయని చంద్రబాబు ఆశలు పెట్టుకుని, పెద్దగా ఈ నియోజకవర్గంపై దృష్టి సారించకపోవడంతో, వైసీపీ పూర్తిస్థాయిలో ఇక్కడ తమకు అనుకూలంగా పరిస్థితులు మార్చుకుంది.
ఫలితాలు వైసీపీ ఖాతాలో పడేలా చేసుకోగలిగింది.యధావిధిగా చంద్రబాబు స్టేట్మెంట్స్ ఇచ్చారు.రౌడీయిజం చేసి కుప్పం నియోజకవర్గంలో వైసిపి గెలిచింది అని హడావుడి చేసి సరిపెట్టుకున్నారు.ఇక లోకేష్ 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన మంగళగిరి నియోజకవర్గంలోనూ ఇప్పుడు వైసీపీ మద్దతుదారులు గెలిచారు.
మరోసారి మంగళగిరి నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీచేసి గెలుస్తానని చెప్పిన లోకేష్ పంచాయతీ ఎన్నికలలో పట్టు సాధించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం, పూర్తిగా పట్టించుకోనట్టుగా వ్యవహరించడం, అక్కడ పార్టీ ఇంఛార్జిగా లోకేష్ ఉన్నా, గెలుపునకు సంబంధించి కింది స్థాయి నాయకులపైనే లోకేష్ భారం వేయడం వంటి కారణాలతో ఫలితాలు తేడా కొట్టాయి.లోకేష్, చంద్రబాబు నియోజకవర్గంలో పరిస్థితి ఈ విధంగా ఉండడతో టీడీపీ పరువు పోయింది అనే భావనలో ఉన్న క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు బాబు రంగంలోకి దిగారు.
ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో రిపేర్లు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.ఈ మేరకు త్వరలోనే ఈ నియోజకవర్గాల్లో పార్టీ పట్టు పెంచే విధంగా అక్కడికి నాయకులతో సమావేశాలు నిర్వహించి, నష్టనివారణ చర్యలకు దిగబోతున్నారట.
ముఖ్యంగా కుప్పం నియోజకవర్గం మొదటి నుంచి చంద్రబాబు కంచుకోటగా ఉంటూ వస్తోంది.ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు అనేక సేవలు అందుతున్నాయి.ఆ ధీమాతోనే ఈ నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం, పూర్తిగా పార్టీ బాధ్యతలు స్థానిక క్యాడర్ మీదే వేయడం వంటి కారణాలతో ఈ పరిస్థితి తలెత్తిందట.చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో రిపేర్లు మొదలుపెట్టి రాబోయే ఎంపీటీసీ, జెడ్పిటిసి ,మున్సిపల్ ఎన్నికలలో ఈ రకమైన పరిస్థితులు తలెత్తకుండా , ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెడుతున్నారట.