పార్టీ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనే నీలినీడలు కమ్ముకున్నాయి.ఎన్ని చేసినా, పార్టీకి భవిష్యత్తు ఉండదని, చంద్రబాబు ఎక్కువ కాలం యాక్టివ్ గా ఉండే పరిస్థితి లేదని, ఆ తర్వాత టిడిపి బాధ్యతలు మొత్తం లోకేష్ నిర్వహిస్తారని, కానీ ఆయనకు పార్టీని నడిపించే అంతటి శక్తి సామర్థలు లేవని, ఇలా ఎన్నో సందేహాలు మరెన్నో అనుమానాలు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉన్నాయి.
టీడీపీ కి రాజకీయ భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో ఇప్పటికే చాలామంది కీలక నాయకులు పార్టీని వీడి అధికార పార్టీ వైపు వెళ్లిపోయారు.మరి కొందరు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ పరిస్థితి నుంచి పార్టీని గట్టెక్కించడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
కరోనా వైరస్ భయంతో చంద్రబాబు ఇంటికే పరిమితం అయిపోతున్నారు.70 ఏళ్ల వయస్సులో ఆయన ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నా, తన ఆరోగ్యాన్ని సైతం పక్కనపెట్టేస్తున్నారు.అలుపెరగకుండా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులతోనూ, మీడియాతోనూ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, పార్టీకి ఊపు తెచ్చే విధంగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.ఏదో ఒక రకంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి పార్టీ కార్యకర్తలు, నాయకులను యాక్టివ్ చేయాలనేది చంద్రబాబు లక్ష్యంగా ప్రయత్నిస్తున్నారు.
కానీ చంద్రబాబు ప్రయత్నాన్ని ఆ పార్టీ నాయకులు ఎవరు పట్టించుకోనట్టు గానే వ్యవహరిస్తున్నారు.
ముఖ్యంగా నియోజకవర్గస్థాయి నాయకులంతా మొహం చాటేసినట్టుగా వ్యవహరిస్తున్నారు.పార్టీ కోసం ఎంతగా కష్టపడినా, ఎన్ని సొమ్ములు వెచ్చించినా, ఫలితం ఏముంటుంది అనే అభిప్రాయంతో ఎవరికి వారు ఇళ్లకే పరిమితం అయిపోతున్నారు.దీనికి తోడు పార్టీలో యాక్టివ్ గా ఉంటే, ప్రభుత్వం కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతుందనే భయంతోనూ చాలామంది నాయకులుగా ఉండేందుకు ఇష్టపడటం లేదు.
ఇప్పటికే పార్టీలో కొంతమంది నాయకులను అరెస్టు చేసి, వారిపై అనేక కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ పరిణామాలు పార్టీ నాయకుల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి.ప్రస్తుతం చంద్రబాబు టిడిపి జాతీయ అధ్యక్షుడిగా ఉండగా, ఏపీ అధ్యక్షుడిగా కళావెంకట్రావు, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు గా ఎల్ రమణ ఉన్నారు.
తెలంగాణలో ఎలాగూ పుంజుకునే అవకాశం లేదని చంద్రబాబు ఎప్పటి నుంచో పట్టించుకోవడం మానేశారు.కానీ ఏపీ విషయంలో అలా నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ పరిస్థితి తలెత్తుతుందనే భయం ఆయనలో ఉంది.అందుకే టిడిపి ఏపీ అధ్యక్షుడిగా ఉన్నా లేనట్టుగా వ్యవహరిస్తున్న కిమిడి కళా వెంకట్రావును తప్పించి ఆ స్థానంలో మాజీ మంత్రి పార్టీ కీలక నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయిపోయారు.
ఈ నెల 27వ తేదీన ఆ నియామకాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు.
ఆయన అయితే పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్లి ప్రభుత్వంపై పోరాటం చేసి, మళ్ళీ పునర్వైభవం తీసుకు రాగలరని నమ్ముతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తాను యాక్టివ్ గా ఉండే అవకాశం లేకపోవడం, ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే పరిస్థితి కనిపించకపోవడం, మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.బాబు ఆశయాలను నెరవేర్చుతూ, ఏపీ టీడీపీ ని అచ్చెన్న ఎంతవరకు ముందుకు తీసువెళ్తారు ? పార్టీని ఏ విధంగా వైసీపీ కంటే ధీటుగా మార్చుతారు ? అనే విషయంపైనే టిడిపి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.