రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపిన పోతిరెడ్డిపాడు అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మౌనంగా ఉన్నారని, ఆయన దీనిపై మాట్లాడేందుకు భయపడుతున్నారని, దమ్ముంటే చంద్రబాబు బయటికి వచ్చి సమాధానం చెప్పాలంటూ గత కొద్ది రోజులుగా వైసీపీ నాయకులు సవాల్ చేస్తూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఎట్టకేలకు ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
పోతిరెడ్డిపాడు ను నిర్మించింది తానేనని, అటువంటిది నన్నే ప్రశ్నిస్తారా అంటూ చంద్రబాబు వైసీపీ నాయకుల పై మండిపడ్డారు.తెలంగాణ ప్రాజెక్టులతో ఏపీ పాకిస్థాన్ లా మారుతుందని గతంలో ప్రకటించిన జగన్, అధికారంలోకి రాగానే తెలంగాణ కు అమ్ముడుపోయారని మండిపడ్డారు.
కెసిఆర్ ఏమైనా మంచోడా ? రేపొద్దున్న ఏపీ ని ముంచేస్తే ఎవరు బాధ్యులు ? జగన్ అజ్ఞానానికి ఏపీ ప్రజలు బలి అవ్వాలా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మాట్లాడితే చాలు వైఎస్ కుటుంబం గొప్ప అంటూ బాబు ప్రశ్నించారు.నేను పట్టుబట్టి తీసుకు వచ్చే వరకు పులివెందులకు నీళ్లకు గతి లేవు.రాజకీయంగా మేము లబ్ది పొందామా లేదా అనేది పక్కన పడితే, పులివెందుల ప్రజలకు నీటి అవసరాలను తీర్చమనే అసంతృప్తి మాకు దక్కింది అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో 60కి పైగా ప్రాజెక్టులు చేపట్టామని ఆయన అన్నారు.ఏపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేందుకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా జూమ్ యాప్ ద్వారా మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నా, దాని నియంత్రించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలు లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అక్రమ అరెస్టులు, పోతిరెడ్డిపాడు వివాదాన్ని తెరపైకి తెచ్చారని చంద్రబాబు అన్నారు.గతంలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కేటాయించిన కాంట్రాక్టులు, ప్రాజెక్టుల్లో ఏ ఒక్క దానిని నేను రద్దు చేయలేదని, అలా చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు రావడంతో పాటు పనులు ఆలస్యం అవుతాయని తనకు తెలుసునని, కానీ ఈ అజ్ఞాని జగన్ అధికారంలోకి వస్తూనే కాంట్రాక్టులు పీపీ ఏలను రద్దు చేయడంతో పోలవరం ప్రాజెక్టుతో పాటు, అన్ని పనులు నిలిచి పోయాయన్నారు.గత ఏడాది భారీ వర్షాలు కురిసినా రాయలసీమకు నీళ్లు తరలించకుండా, తన ఇంటిని ముంచాలని జగన్ చూశారని చంద్రబాబు విమర్శించారు.
జగన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పోతిరెడ్డిపాడు విస్తరణ పేరుతో నాటకాలాడుతున్నారని, సీఎం హోదాలో తెలంగాణ కు వెళ్లి ప్రాజెక్టులను ఆశీర్వదించి ఇప్పుడు కెసిఆర్ పై యుద్ధం చేసినట్లుగా బిల్డప్ ఇస్తున్నారన్నారు.కేసీఆర్ ఏమైనా మంచోడా ? చెడ్డోడా అనే చర్చకు తాను వెళ్లడం లేదన్నారు.తాను వేసిన ప్రశ్నలకు జగన్ దగ్గర సమాధానం ఉందా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.