టీడీపీ అధినేత చంద్రబాబు ను వేధిస్తున్న ప్రధాన సమస్య ఏదైనా ఉందా అంటే అది పొత్తుల అంశంపై. జనసేన బిజెపి పార్టీలలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే, 2024 ఎన్నికల్లోనూ 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయనే భయం బాబును వేధిస్తోంది.
అందుకే అన్ని మొహమాటాలను పక్కన పెట్టి మరీ కొత్త పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.టిడిపి నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుల ద్వారా ఒకవైపు బిజెపితో పొత్తు కోసం ప్రయత్నిస్తూనే, మరోవైపు ఆర్ఎస్ఎస్ కీలక నేతలతో మంతనాలు చేస్తూ, బిజేపిని పొత్తుకోసం ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే గతంలో బిజెపితో టిడిపి పొత్తు ఉన్న సమయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరును, ఆ తర్వాత రెండు పార్టీలు మధ్య దూరం పెరిగిన సమయంలో బాబు చేసిన విమర్శలను బిజెపి మర్చిపోలేకపోతోంది.అందుకే భవిష్యత్తులోనూ టిడిపితో పొత్తు లేదనే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తుంది.
ఇక జనసేన విషయానికి వస్తే టిడిపి తో పొత్తు పెట్టుకునేందుకు పవన్ సిద్ధంగానే ఉన్నా, బీజేపీ పవన్ దూకుడుకు బ్రేక్ వేస్తోంది.మన రెండు పార్టీలు కలిసి మాత్రమే ఏపీలో ఎన్నికలకు వెళ్ళాలి అనే షరతులు పవన్ కు విదిస్తోంది.
దీంతో బాబు ఆశ తీరేలా కనిపించడం లేదు.ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీనే.ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, పెద్దగా ప్రయోజనం ఉండదు అని, పైగా బిజెపి దగ్గర అనవసరంగా ఇబ్బందులు పడాలని బాబు తీవ్రంగా ఆలోచిస్తున్నారు.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితి.
బీజేపీతో కటీఫ్ చేసుకుని టిడిపికి దగ్గరగా వద్దామని పవన్ అభిప్రాయపడుతున్నా, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని సక్సెస్ అయినా, తనకు సీఎం కుర్చీ దక్కదని, మిగతా పదవులు తీసుకున్నా, తన స్థాయికి తక్కువే అనేది పవన్ అభిప్రాయంగా తెలుస్తోంది.
అందుకే తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీతో ఉంటేనే బెటర్ అని , ఇప్పటికే టిడిపి మద్దతుదారుడుగా తనపై వైసిపి ముద్ర వేస్తోందని , మరోసారి పొత్తు కు వెళితే పూర్తిగా అభాసుపాలు కావాలి అనే ఆలోచన తో పవన్ టిడిపి ని దూరం పెడుతున్నారట.ఇలా ఎవరికి వారు ఏదో ఒక కారణంతో తమ కు దూరం అవుతుండడం, మళ్ళీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చేలా ఉండడంతో బాబు నానా హైరానా పడుతున్నారట.