ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది.పార్టీ క్యాడర్ లోనూ నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి.పార్టీ నాయకుల్లో ఉత్సాహం పెంచే విధంగా టిడిపి అధినేత చంద్రబాబు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు.2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని, అలా జరగకపోతే ఇక పార్టీని మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనే విషయం చంద్రబాబు కు బాగా తెలుసు.అందుకే వైసీపీకి పోరాడేందుకు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు , ఆందోళనలు చేస్తూ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు.తన వయసును కూడా లెక్క చేయకుండా, క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు.
అయినా సొంత పార్టీ నాయకుల్లో జోష్ అయితే కనిపించడం లేదు.దీంతో పార్టీ నేతల్లో ఉత్సాహం పెంచేందుకు పార్టీలో పెద్ద ఎత్తున నాయకులను చేర్చుకోవడమే మార్గమని, ఇతర పార్టీల నుంచి నాయకులు చేరుతూ ఉంటే, పార్టీ నాయకులలోనూ ఉత్సాహం పెరుగుతుంది అని బాబు బలంగా నమ్ముతున్నారు.
టిడిపి నుంచి ఇతర పార్టీలో చేరిన నాయకుల్లో చాలామంది ఇప్పటికే పార్టీలో చేరుతామంటూ రాయబారాలు పంపిస్తున్నారని, అలాగే బీజేపీ ,వైసిపి, కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి అసంతృప్తి నాయకులు చాలామంది టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతూ ఉండడం తో కీలకమైన నేతలను పార్టీలో చేర్చుకుని పార్టీ కేడర్ లో ఉత్సాహం పెరిగేలా చేయాలని బాబు ప్లాన్ చేసుకున్నారట.
ఇప్పటికీ టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి అనుభందంగా కొనసాగుతున్న విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆ పార్టీ లో ఇమడలేక టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమయినట్టు సమాచారం.అయితే మొదట్లో ఆయన చేరికను బాబు వ్యతిరేకించినా, ఇప్పుడు మాత్రం ఆయనను మళ్ళీ టీడీపీ లో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారట.ఇదేవిధంగా వివిధ కారణాలతో ఇతర పార్టీలోకి వెళ్లిన నాయకులు టీడీపీలోకి వస్తామంటే వెంటనే వారిని చేర్చుకోవాలని , వరుసగా చేరికలను ప్రోత్సహించడం ద్వారా, టీడీపీ ని మరింత బలోపేతం చేయాలనే ప్లాన్ లో బాబు ఉన్నట్టు సమాచారం.