ఎవరు ఎన్ని చెప్పినా తన తనయుడు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కు బంగారు బాట వేయడం తో పాటు, కీలకమైన స్థానం లో కూర్చోబెట్టాలనే ఏకైక లక్ష్యంతో టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారు.దాని కోసం ఎంతటి త్యాగానికైనా ఆయన సిద్దం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.తాను ముందు ముందు యాక్టివ్ గా ఉండలేను అని, అందుకే పార్టీలో లోకేష్ ప్రాధాన్యం పెంచాలని చూస్తున్నారు .2019 ఎన్నికల్లో లోకేష్ చాలా దిమాగానే మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.ఈ నియోజకవర్గం అమరావతి ప్రాంతంలో ఉండడం, అక్కడ రాజధాని కోసం టీడీపీ చేసిన కృషి , స్థానిక ప్రజల్లో మద్దతు, ఇవన్నీ తమకు కలిసి వస్తాయని లోకేష్ అభిప్రాయపడ్డారు .అయితే వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానికంగా బలమైన నేత కావడంతో , లోకేష్ ఆ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు.ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకు పోటీచేసి గెలవకపోవడం తో రాజకీయంగా అనేక విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇది లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు , చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది.
అందుకే చంద్రబాబు లోకేష్ ను బలమైన నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని డిసైడ్ అయ్యారు.ఈ క్రమంలోనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని లోకేష్ కోసం త్యాగం చేయాలని డిసైడ్ అయ్యారట.1989 నుంచి ఈ నియోజకవర్గం నుంచి చంద్రబాబు గెలుస్తునే వస్తున్నారు.ఈ నియోజకవర్గంలో టీడీపీ కి ఉన్న గట్టిపట్టు, తన చరిష్మా అన్ని తనకు కలిసి వస్తాయనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ నియోజకవర్గాన్ని లోకేష్ కోసం కేటాయించి , తాను ఎన్నికలకు దూరంగా ఉండాలని, ఇదే సమయంలో పార్టీని గెలిపించేందుకు రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటనలు చేస్తూ, పార్టీని అధికారంలోకి వచ్చేలా చేయాలని, ఆ తర్వాత టిడిపి ఘనవిజయం సాధిస్తే లోకేష్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించి, తాను వెనుక ఉండి రాజకీయం నడిపించాలనే ఆలోచనలో చంద్రబాబు ఈ త్యాగం చేసేందుకు సిద్ధమవుతున్నారట.
ఇప్పటికే లోకేష్ పనితీరుపై పార్టీ నేతల్లోనే సదాభిప్రాయం లేదు.ఇటీవలే చంద్రబాబు లోకేష్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేసేందుకు సిద్ధమైన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సైతం లోకేష్ విషయంలో తొందరపడవద్దని, 2024లో మీరే ముఖ్యమంత్రి గా ఉండాలి అంటూ చంద్రబాబుకు హితబోధ చేశారు.అయినా చంద్రబాబు మాత్రం లోకేష్ రాజకీయ భవిష్యత్తు విషయంలో చాలా సీరియస్ గా ఉండడంతో ఈ విషయంలో ఎవరి మాటా వినేలా కనిపించడం లేదు.