ఏపీ అధికార పార్టీలో ఎన్నికల టెన్షన్ బాగా పెరిగిపోయింది.ఒక పక్క పవన్ మరోపక్క జగన్ పక్కలో బల్లెంలా మారడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధం అవ్వాల్సి రావడంతో అధికార పార్టీ బాగా ఒత్తిడికి గురవుతోంది.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని కసిగా ఉన్న బాబుకు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్యెల్యేలు పెద్ద మైనెస్ గా మారారు.ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్యెల్యేలు చాలామంది వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదని సర్వేలు కుండబద్దలగొట్టినట్టు తేల్చేయడంతో ఈ సారి గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయించాలని బాబు ఆలోచన చేస్తున్నాడు.
ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇచ్చేది లేదని .కొత్తవాళ్లకు కావాలంటే టికెట్లు ఇవ్వడానికి కూడా తను వెనుకాడను అని కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్నారు.ఇదే జరగబోతోందని.చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చేసారి టికెట్లు దక్కే అవకాశం లేదని కూడా ప్రచారం జరుగుతోంది.అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రత్యేకించి అధికార పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండటం అంటే అంతకు మించిన అవకాశం మరొకటి లేదు.వ్యక్తిగతంగా పేరు తెచ్చుకోవచ్చు.
పార్టీకి మంచిపేరు తెచ్చి పెట్టవచ్చు.మరోసారి గెలుపుకు బాటలు వేసుకోవచ్చు.
అయితే ఎన్నికలయ్యాకా నాలుగేళ్లకు, ఎన్నికలు మళ్లీ దగ్గరపడుతున్న వేళ టీడీపీ సిట్టింగులు మాత్రం బాగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని స్పష్టం అవుతోంది.
ఈ ఎఫెక్ట్ ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువగా ఉండబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మరీ ముఖ్యంగా టీడీపీకి కంచుకోటలా ఉన్న అనంతపురం లో సగం మంది సిట్టింగ్ ల స్థానాలు గల్లంతయ్యే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది.అలాగే బాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో సిట్టింగులకే మళ్లీ పోటీచేసే ఆసక్తిలేదని, ఒక ఫిరాయింపు మంత్రి నియోజకవర్గం మారడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఇక కడపలో ఉన్నదే ఒక్క సీటు అది చేజారడం గ్యారెంటీ.కర్నూలులోనూ ఇదే పరిస్థితి.ఇక్కడా సిట్టింగులు, ఫిరాయింపుదార్లు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.మొత్తంగా రాజకీయంగా ఏ జిల్లాల్లో అయితే టీడీపీ బలపడిందో అక్కడే వ్యతిరేకత కూడా మూటగట్టుకుంటోంది.
గత ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలామంది కేవలం తమ వ్యక్తిగత స్వార్థం మాత్రమే చూసుకున్నారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.ఎమ్యెల్యేలు కేవలం తాము సంపాదించుకోవడానికే ప్రాధాన్యతను ఇస్తున్నారని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారాలు అన్ని చంద్రబాబు దృష్టికి చేరడంతో పాటు .సర్వేల ఎఫెక్ట్ కూడా ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకోసం బాబు అన్వేషణ మొదలుపెట్టాడు.