టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి గెలుపు మీద ధీమా ఎక్కువగా కనిపిస్తోంది.ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం అంటూ పదే పదే చెబుతున్న బాబు అందుకు తగ్గట్టుగా కసరత్తు చేయడం ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది.
ఏపీలోని ప్రతి నియోజకవర్గం నుంచి పోలింగ్ బూత్ ల వారీగా సమగ్ర వివరాలు పంపాలంటూ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ వ్యవహారాన్నంతటిని తన సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచే ప్రారంభించారు.
ఈ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల నుంచి పోలింగ్ కి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పటికే తెప్పించుకుని కసరత్తు మొదలెట్టారట
కుప్పం నుంచి చంద్రబాబు దాదాపు 70 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్టు స్థానిక నాయకులు లెక్కలు సమర్పించినట్టు తెలిసింది.ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇదే తరహాలో వివరాలు పంపిస్తే వాటన్నిటిని పరిశీలించి ఒక అంచనాకు రావచ్చని బాబు ఆలోచన చేస్తున్నాడు.
త్వరలో తాను నిర్వహించే పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలో అన్ని విషయాలను చర్చిస్తానని బాబు పార్టీ నాయకులకు చెబుతున్నాడు.దీంతో నేతలంతా లెక్కలు సేకరించే పనిలో నిమగ్నం అయినట్టు తెలుస్తోంది.
అయితే కొంతమంది నాయకులు మాత్రం ఎన్ని లెక్కలు వేస్తే ఏంటి ? ఈవీఎం లలో ఉన్న ఫలితాలు అయితే మారవు కదా అంటూ నిట్టూరుస్తున్నారు
ఇప్పటికే గెలుపు మీద ఆశలు వదులుకున్న కొందరు తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు సూచనలను పెద్దగా పట్టించుకోవడంలేదట.ఇది ఇలా కొనసాగుతుండగానే టీడీపీలోని కొంతమంది ఎమ్యెల్యే అభ్యర్థులు వైసీపీ అధినేత జగన్ తో టచ్ లోకి వెళ్లినట్టు సమాచారం.
ఈ విషయం బాబు కి చేరడంతో ఆయన కలవరం చెందుతున్నాడట.ఈ క్రమంలోనే బాబు కాగితాలను ముందు వేసుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.ఓట్ల లెక్కింపు సమయం వరకు పార్టీ శ్రేణులు చేజారిపోకుండా ఈ విధంగా ప్లాన్ వేసినట్టు మరికొంతమంది అనుమానిస్తున్నారు.