నిత్యం ఏదో ఒక హడావిడితో టీడీపీ అధినేత చంద్రబాబు వార్తల్లో ఉంటూనే వస్తున్నారు.నిరాశా నిస్పృహల్లో ఉన్న పార్టీని, నాయకులను ఎప్పటికప్పుడు ఉత్సాహపరిచే విధంగా ఏదో ఒక చర్యలు తీసుకుంటూనే వస్తున్నారు.
అధికార పార్టీ స్పీడ్ ను తట్టుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు.అప్పుడే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది.
పార్టీ నాయకులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పార్టీ నాయకుల్లో భయాందోళనాలు పెరిగిపోయాయి.
పార్టీ తరపున యాక్టివ్ గా ఉంటే ప్రభుత్వ వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలామంది బయటకు వచ్చేందుకు సాహసం చేయలేకపోతున్నారు.అందుకే పార్టీ అధిష్టానం ఎన్నిసార్లు ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపు ఇస్తున్నా, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశిస్తున్నా, రియాక్ట్ కావడం లేదు.
ఇది గమనించే కొద్ది రోజుల క్రితం పెద్దఎత్తున రాష్ట్ర, జాతీయ స్థాయి కమిటీలను ప్రకటించి తెలుగుదేశం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీ ఎత్తున పదవులను భర్తీ చేశారు.దాదాపు ఎక్కడా, ఎవరికీ ఎటువంటి అసంతృప్తి లేకుండా చేసుకోగలిగారు.
అయినా ఏదో వెలితి కనిపిస్తుండడంతో మరోసారి కొత్త పదాలను సృష్టించి మరీ నాయకులకు పదవులను ఇస్తున్నారు.అడిగిన వారికి, అడిగిన వారికి అందరికీ ఈ కమిటీలలో పదవులు ఇస్తూ, వారిని యాక్టీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
13 జిల్లాల పార్టీ అధ్యక్షులను పార్లమెంట్ స్థాయికి పరిమితం చేసి, మొత్తం 25 మంది అధ్యక్షులను నియమించారు.అదే విధంగా దాదాపు 25 నియోజకవర్గాలను మరో ఐదు విభాగాలుగా చేసి, పార్టీలోని సీనియర్ నాయకులను నియమించారు.
వీరు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం నుంచి, నాయకులకు ఎదురవుతున్న ఇబ్బందులు, నాయకుల మధ్య ఉన్న విభేదాలు, అధికార పార్టీని ఇరుకునపెడుతూ, పార్టీ నాయకుల్లో ఉత్సాహం తీసుకువచ్చే విధంగా చంద్రబాబు కొత్త నియామకాలు చేపట్టారు.అయితే ఈ కొత్త నియామకాల వల్ల పార్టీకి ఏదైనా ఉపయోగం ఉంటుందా అంటే సందేహమే.
ఇక టిడిపి రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఘోర పరాజయం పాలైన విషయాన్ని ఇప్పటికే మర్చిపోలేక పోతున్నారు.
2022లో జమిలి ఎన్నికలు వచ్చినా, లేక 2024లో సాధారణ ఎన్నికలు వచ్చినా, పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని చూస్తోంది.దీనికోసం బిజెపితో నిత్యం సంప్రదింపులు చేస్తూనే, ఆ పార్టీని పట్టించుకోనట్టు గానే వ్యవహరిస్తోంది.దీంతో పొత్తులు ఏర్పాటు చేసుకునేందుకు పార్టీ తరఫున ఒక పోస్టు ను కొత్తగా ఏర్పాటు చేశారు. టీడీపీతో పొత్తు ఏర్పాటు చేసుకునేందుకు ఆయా పార్టీలతో సంప్రదింపులు చేయడం వంటి వ్యవహారాలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు అప్పగిస్తూ కొత్త పోస్ట్ క్రియేట్ చేశారు.
దీంతో పొత్తుల కోసం టిడిపి ఎంత ఆరాట పడుతుంది అనే విషయం అర్థమవుతోంది.కొత్త గా పదవులు పొందిన నాయకులు ఎంతో కొంత యాక్టివ్ గా ఉంటూ, కింది స్థాయి నాయకులను ఏకం చేసే పనిలో నిమగ్నం అవుతారనేది బాబు అభిప్రాయం గా కనిపిస్తోంది.