టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంత మొండివాడో అంత సమయ స్ఫూర్తి ఉన్నవాడు.ఎంతటి అపాయం వచ్చినా తన ఉపాయంతో వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తుంటాడు.
వయస్సురీత్యా చూసినా చంద్రబాబు కి ఇది రిటైర్మెంట్ సమయం.ఎలాగూ తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కాబట్టి చంద్రబాబు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు.
అయితే చంద్రబాబు మాత్రం ఆ పని చేయడంలేదు.ఇప్పటికే క్షణం తీరికలేకుండా ఎత్తులు పై ఎత్తులు వేస్తూ అధికార పార్టీని ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరూ ఇంత స్థాయిలో కష్టపడేవారు కాదేమో అన్నది ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నమాట.ప్రస్తుతం బాబు ఫోకస్ అంతా జగన్ మీదే పెట్టాడు.
వైసీపీ ప్రభుత్వం మీద ఏదైనా తప్పులు దొరికితే వాటిని బాగా హైలెట్ చేసేపనిలో ఉన్నాడు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుతీరి కేవలం రెండు నెలలే అయ్యింది.ఈ తక్కువ సమయంలోనే ఎన్నో ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అమలుచేయడంతో పాటు, పెద్ద ఎత్తున ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.వాస్తవంగా చెప్పాలంటే ఇంత తక్కువ సమయంలో ఎక్కువే చేసినట్టు.
అదీ కాకుండా ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన అనేక హామీలతో పాటు, ‘నవరత్నాలు’ పథకాల మీద ఎక్కువే దృష్టిపెట్టి వాటి అమలుకు ప్రయత్నిస్తున్నాడు.అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
వాస్తవానికి రెండు నెలల సమయం అంటే ఏ ప్రభుత్వానికి అయినా చాలా తక్కువ సమయమే.
కొత్త ప్రభుత్వం పాలనా ఫలితాలు క్షేత్ర స్థాయికి చేరి వారి నుంచి వచ్చే స్పందనను బట్టి ప్రతిపక్షాలు తమ ఆందోళను, పోరాటాలు నిర్ణయించుకునేవి.కానీ ప్రస్తుతం చంద్రబాబు వంటి రాజకీయ ఉద్దండులు అంత సమయం వరకు వేచి చూసే పరిస్థితుల్లో ఉండడంలేదు.ఇదే విషయాన్ని మీడియా ముందు కూడా చెప్పేందుకు బాబు వెనుకాడడంలేదు.
ఇది అసమర్ధ ప్రభుత్వం, అరాచక ప్రభుత్వమని ,ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానంటూ గట్టిగానే చెబుతున్నారు.జగన్ ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తున్నా వాటిని మాత్రం ప్రజల్లో హైలెట్ చేసుకోలేకపోతోంది.
కానీ టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా మాత్రం జగన్ ప్రభుత్వంలో తప్పులను వెతికి పట్టుకుని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది.