ప్రతిసారి ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు అనే ప్రచారం మొదలవడం , చివరి నిముషంలో అది కాస్త రద్దు కావడం సర్వసాధారణంగా మారిపోయింది.గతంలో ఎన్నోసార్లు జగన్ ఢిల్లీకి వెళ్లినా, బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ లభించకపోవడంతో ఒకటి, రెండు రోజులు అక్కడే వేచి చూసి చేసిన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి.
ఇది కాస్త జగన్ ప్రభుత్వానికి ఇబ్బంది కరమే అయినా, బిజెపి పెద్దల బిజీ షెడ్యూల్ కారణంగా ఈ తరహా పరిస్థితి ఏర్పడుతూ వస్తోంది.అయితే ఈ పరిణామాలను టిడిపి, ఆ పార్టీ అనుకూల మీడియా తమకు అనుకూలంగా మార్చుకుని జగన్ ను అభాసుపాలు చేస్తూ వచ్చేవి.
కేంద్ర బిజెపి పెద్దలు అమిత్ షా , ప్రధాని నరేంద్ర మోదీని మరి కొంతమంది అపాయింట్మెంట్ దొరికి వారితో భేటీ అయినా, జగన్ కు క్రెడిట్ రాకుండా మరో ప్రచారానికి తెర తీసేవారు.
జగన్ ఢిల్లీకి వెళ్లింది ఏపీ ప్రయోజనాల కోసం కాదు అని, తన కేసుల మాఫీకి సంబంధించి బిజెపి పెద్దలను వేడుకునేందుకు ఆయన వెళ్లారు అంటూ ప్రచారం చేసేది .అయినా వైసిపి పెద్దగా ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆసక్తి చూపించకపోవడం, జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కనీసం మీడియా సమావేశం నిర్వహించకపోవడం తదితర కారణాలతో టిడిపి పార్టీ అనుకూల మీడియా చెప్పిందే జనాల్లోకి వెళ్తూ వస్తోంది.ఇక రెండు రోజుల క్రితం జగన్ ఢిల్లీ పర్యటన కు వెళ్లాల్సి ఉన్నా, చివరి నిమిషంలో అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు కావడంతో జగన్ తన పర్యటనను వాయిదా వేస్తున్నారు .మళ్లీ రేపు అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడంతో జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు.
ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంతో పాటు , పోలవరం ప్రాజెక్ట్ ,ఏపీకి నిధులు తదితర అంశాలపై జగన్ చర్చించ బోతున్నారు.అయితే ఇప్పుడు కూడా జగన్ కేసుల మాఫీ గురించే ఢిల్లీకి వెళుతున్నారనే ప్రచారం టిడిపి మొదలుపట్టింది. జగన్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి అపాయింట్మెంట్ దొరక్క వెనక్కి వచ్చినా దాన్ని తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుని విమర్శించేందుకు వాడుకుంటోంది.
కానీ వైసిపి మాత్రం ఈ విషయంలో విఫలం అవుతున్నట్టుగానే కనిపిస్తోంది.