దూరదృష్టితో ఆలోచిస్తూ, ఎప్పుడూ అన్ని విషయాల్లో పైచేయి సాధించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.టీడీపీ అధినేత చంద్రబాబు.ఒక్కో సారి లెక్క తప్పినా, చాలా వరకు బాబు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగానే రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.2024 ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే కష్టపడుతున్నారు.2014లో బాబు బీజేపీ తో పొత్తు పెట్టుకున్నారు.అనుకున్నట్టుగానే విజయం సాధించారు.
కానీ మధ్యలోనే బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు.దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత పెరుగుతోందని, రానున్న రోజుల్లో ఆ పార్టీ గెలిచే అవకాశమే లేదని బాబు అంచనా వేశారు.
కానీ ఆయన లెక్క తప్పని 2018 చివరి నాటికి గాని బాబు గ్రహించలేకపోయారు.అప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో, ఆ పార్టీ జగన్ వైపు నిలబడ్డం, ఎన్నికల్లో పరోక్షంగా మద్దతు ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో టీడీపీ చతికల పడాల్సి వచ్చింది.
అయితే టీడీపీ ప్రతిపక్షంలో కూర్చున్నా, 2024 నాటికి మళ్ళీ టీడీపీ గెలవాలి అంటే ఖచ్చితంగా బీజేపీ అండదండలు ఉండి తీరాల్సిందే అని బాబు నమ్ముతున్నారు.
కానీ బీజేపీ మాత్రం టీడీపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.
వైసీపీకి సన్నిహితంగానే ఉంటూ వస్తోంది.అయితే ఎప్పటికైనా వైసిపి టీడీపీ కి మధ్య విభేదాలు తలెత్తుతాయని, అప్పుడు మళ్ళీ బీజేపీకి దగ్గర అవచ్చు అనే లెక్కలు వేసుకుంటున్నారు.
సరిగ్గా ఇప్పుడు ఆ సమయం వచ్చినట్టుగానే కనిపిస్తోంది.ఏపీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో బీజేపీకి వైసిపి కి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.
దీంతో తప్పనిసరిగా వైసిపి కేంద్రంతో యుద్ధానికి దిగాల్సిన పరిస్థితి వస్తుంది.లేకపోతే ఏపీలో రాజకీయంగా ఎన్నో విమర్శలు ఎదుర్కోవడంతో పాటు, ఇబ్బందికర పరిణామాలు తలెత్తుతాయి అని తెలుసు.
అందుకే ఇప్పుడు ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది వైసీపీకి అర్థం కాకుండా ఉంది.కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు జగన్ సిద్ధమైతే, కేంద్ర బీజేపీ పెద్దలకు ఆగ్రహం కలుగుతుంది.
తద్వారా రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తుతాయని టీడీపీ అంచనా వేస్తోంది.అలా కాకుండా కేంద్రంతో లాలూచీపడితే, ఏపీలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సిందే.దీనిపైన అవసరమైతే టీడీపీ ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేసుకునేందుకు టీడీపీ ప్లాన్ చేసుకుంటోంది.కానీ కేంద్రంపై ఎటువంటి విమర్శలు చేయకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలనేది టీడీపీ ప్లాన్.
ఇలా ఏదో రకంగా బీజేపీ వైసిపి ల మధ్య విభేదాలు తలెత్తడం ఖాయం అని టీడీపీ అంచనా వేస్తోంది.ఇప్పటికే కేంద్ర బీజేపీ పెద్దలతో ఫోన్ ద్వారా పరామర్శలు చేస్తూ, వారితో సఖ్యత గా ఉండేందుకు ప్రయత్నిస్తున్న బాబు, ఈ రెండు పార్టీల మధ్య తలెత్తిన విభేదాలను వాడుకుని బీజేపీకి మరింత దగ్గరయ్యేందుకు, పొత్తు బాట వేసుకునేందుకు చక్కని మార్గం ఏర్పడుతుందని బలంగా నమ్ముతున్నారు.