2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లింది తెలుగుదేశం పార్టీ.ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అలాగే కేంద్ర కేబినెట్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, బిజెపి ఎమ్మెల్యేలు ఏపీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇక బీజేపీ టీడీపీ బంధం సాఫీగా సాగుతోంది అనుకుంటుండగా ఆకస్మాత్తుగా బీజేపీతో చంద్రబాబు వైరం పెట్టుకున్నారు.
దీంతో ఏపీ కేబినెట్ లో బీజేపీ మంత్రులు, బిజెపి క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్న టిడిపి కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.ఇక అప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ వైరం తీవ్రస్థాయిలో ముదిరిపోయింది.
ప్రతి దశలోనూ కేంద్రం తీరును తప్పుబడుతూ చంద్రబాబు విమర్శలు చేస్తూ వచ్చారు.బిజెపి కూడా టిడిపిపై విమర్శలు చేసింది.
ఈ రెండు పార్టీల మధ్య వైరం బాగా ముదిరిపోయింది.
టిడిపిపై ఆగ్రహంతో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి బిజెపి పూర్తిగా సహకరించి జగన్ అధికారంలోకి వచ్చేందుకు పరోక్షంగా కారణం అయ్యింది.151 సీట్లతో జగన్ తిరుగులేని మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.ఘోర ఓటమి చవిచూసిన తెలుగుదేశం పార్టీ కి అప్పుడుగాని అసలు విషయం బోధపడలేదు.
బీజేపీతో అనవసరంగా వైరం పెట్టుకున్నామని, ఆ పార్టీతో కలిసి ఉంటే మళ్లీ అధికారం దక్కి ఉండేదని, అలాగే ఓటమి చెందినా, కేంద్రంలో బిజెపి అండతో ఏపీ లో హవా చూపించేందుకు అవకాశం ఉండేదని టిడిపి ఇప్పుడు బాధపడుతోంది.
చాలాకాలం నుంచి చంద్రబాబు బీజేపీ కి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.సందర్భం వచ్చినా, రాకపోయినా బిజెపి కేంద్ర పెద్దలను పొగిడేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.ఏదో ఒక రకంగా ఇప్పుడు బిజెపితో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ఆలోచన.
కానీ టిడిపి సీనియర్లు మాత్రం చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.మళ్లీ బిజెపితో పొత్తు పెట్టుకుని వ్యూహాత్మక తప్పిదం ఎందుకు చేయాలని, ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు లేదని, పైగా కొన్ని వర్గాల ప్రజలు బిజెపి ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, కాబట్టి బీజేపీతో వద్దే వద్దని చంద్రబాబు ను మొత్తుకుంటున్నారు.
అలాగే మోదీ గ్రాఫ్ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందని , ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే అనవసర నిందలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు పార్టీ సీనియర్లు చంద్రబాబు కి సూచిస్తున్నారట.