గతంలో మాదిరిగా కాకుండా, తెలుగుదేశం పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసే విషయంపైన ఆ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు.ఇప్పటికే నిరాస నిస్పృహ లో ఉన్న పార్టీ క్యాడర్ లో నూతన ఉత్సాహం తీసుకువచ్చేందుకు పదవులను ఈ మధ్యనే ఆయన భర్తీ చేశారు.
ఆ పదవుల్లో ఎక్కువగా బీసీ సామాజికవర్గానికి చెందిన వారిని కేటాయించడంతో తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఆదరణ పెరిగిందని చంద్రబాబు నమ్ముతున్నారు.ఆ ఎఫెక్ట్ తోనే ఏపీ సీఎం జగన్ సైతం ఇటీవల భర్తీ చేసిన బీసీ కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను, డైరెక్టర్లను పెద్దఎత్తున నియమించారు.దీంతో వైసీపీకి కాస్త ఆదరణ పెరిగినట్టుగా కనిపించింది.2019 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా వైసీపీ వైపు మొగ్గు చూపడంతో ఇప్పుడు వారిని తమ వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
అందుకే పార్టీ పదవుల్లో ఎక్కువగా ఆ సామాజిక వర్గానికి చెందినవారికి పదవులను కేటాయించారు .ఈ పదవుల భర్తీ విషయంలో పార్టీలో కాస్తా అసంతృప్తి ఉన్నా, అవన్నీ సర్దుకుపోతాయి అనే ధీమాలో బాబు ఉన్నారు.ఇంత వరకు బాగానే ఉన్నా, కొత్తగా పదవులు పొందిన వారు ప్రజా సమస్యలపై పోరాడేందుకు కాస్త వెనుకడుగు వేస్తుండటం బాబు దృష్టికి వచ్చింది.దీనికి కారణం పదవులు పొందిన వారు చాలా మంది 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వారే కావడం.
మళ్లీ భారీ ఎత్తున ఖర్చుపెట్టి, పార్టీ తరపున పోరాటం చేసేందుకు ఇష్టపడకపోవడం ఇవన్నీ గుర్తించిన బాబు ఆర్థికంగా మీకు పార్టీ అండదండగా ఉంటుందని, పార్టీ తరపున పోరాటాలు చేపట్టి జనాల్లోకి వెళ్లాలని, ఆ ఖర్చులు మొత్తం టీడీపీ కేంద్ర కార్యాలయం చూసుకుంటుంది అంటూ భరోసా ఇచ్చి, మీ పై ఎటువంటి భారం ఉండదు అంటూ హామీ ఇవ్వడంతో నేతల్లో మరింత ఉత్సాహం పెరిగిందట.
ఇక పూర్తిగా వైసిపి ఫై పోరాటం చేయాలని, ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ తెలుగుదేశం పార్టీకి మేలు జరిగే విధంగా వ్యవహరించాలని బాబు సూచనలు చేశారట.మీరు పోరాటాలు, ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తూ పార్టీలు జోష్ నింపితే మళ్లీ అధికారం చేపట్టడం కష్టమేమీ కాదనే విషయాన్ని పదేపదే చంద్రబాబు నూరిపోస్తూ, పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత, క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే ప్లాన్ వేసుకున్నట్టు గా కనిపిస్తున్నారు.