అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.బెంజ్ సర్కిల్ లో ఉన్న జేఏసీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం చంద్రబాబు జేఏసీ నేతలు పాదయాత్రగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
దీని కారణంగా పోలీసులు, జేఏసీ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.అలాగే అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనకు బయలుదేరబోతున్న జేఏసీ నాయకుల బస్సులను పోలీసులు అడ్డుకోవడంతో దీనికి నిరసనగా చంద్రబాబు తో సహా అఖిలపక్ష నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.
పోలీసులు సీజ్ చేసిన బస్సులను వెంటనే తిరిగి అప్పగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.ఇలా చేస్తే తిరుగుబాటు వస్తుందని,ప్రజలు తిరుబాటు చేస్తే పోలీసులేమి చేయలేరని ఆయన తెలిపారు.
కాగా, ఉద్రిక్తత తీవ్రతరం కావడంతో చంద్రబాబు, లోకేష్తో సహా జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దేవినేని ఉమ, అశోక్ బాబు, రామానాయుడు, అచ్చెన్నాయుడు, పంచుమర్తి అనురాధ, ప్రత్తిపాటి పుల్లారావులను అరెస్ట్ చేశారు.