అందరూ ముందుగా ఊహించినట్టుగానే, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు పేరును , తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రమణ పేర్లను ఖరారు చేస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు టీడీపీ జాతీయ కమిటీ పునర్వ్యవస్థీకరణ చేస్తూ, నిర్ణయం తీసుకున్నారు.
ఈ కొత్త కమిటీలో ముగ్గురు మహిళలకు ఉపాధ్యక్ష పదవులను కేటాయించారు.అలాగే పొలిట్ బ్యూరో కి స్వచ్ఛందంగా రాజీనామా చేసిన గల్లా అరుణకుమారి ఉపాధ్యక్షురాలు గా నియమించారు.
అలాగే ఎంపీ రామ్మోహన్ నాయుడు, లోకేష్, నిమ్మల రామానాయుడు, వర్ల రామయ్య తో పాటు మరో నలుగురు కి జాతీయ ప్రధాన కార్యదర్శిలుగా నియమించారు.
అలాగే గల్లా జయదేవ్ సైతం పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు.ఇక మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, బోండా ఉమ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కళావెంకట్రావు, బాలకృష్ణ, రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి లకు అవకాశం కల్పించారు.అధికార ప్రతినిధులు ఆరుగురికి అవకాశం కల్పించారు.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రమణను నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.రమణ ను టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించ వద్దు అంటూ పెద్ద ఎత్తున చంద్రబాబుపై ఒత్తిళ్లు వచ్చినా, ఆయన్నే అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మొత్తం 31 మంది తో తెలంగాణ టీడీపీకి కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు.అయితే ఏపీ టీడీపీ అధ్యక్షుడు విషయంలోనూ చంద్రబాబుపై ఒత్తిళ్లు వచ్చినా, సాక్షాత్తు చంద్రబాబు తనయుడు లోకేష్ అచ్చెన్నను టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా నియమించవద్దు అని కోరినట్లు ప్రచారం జరిగినా, ఆయన వైపే చంద్రబాబు మొగ్గు చూపించారు.ఈ కొత్త కమిటీలతో అయినా, తెలుగుదేశం పార్టీలో మరింత ఉత్సాహం వస్తుందని బాబు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం పదవులు పొందిన నాయకులంతా, క్షేత్రస్థాయిలో ప్రజాబలం ఉన్నవారే కావడంతో తమకు కలిసి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు.