ప్రస్తుతం ఏపీలో నెలకొంటున్న రాజకీయ పరిణామాలు చంద్రబాబు లో సైతం ఆందోళన కలిగిస్తున్నాయి.టీడీపీ నాయకులను భయబ్రాంతులకు గురి చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పదేపదే చంద్రబాబు వాపోతున్నా, ఫలితం కనిపించడం లేదు.
తాజాగా టీడీపీ నాయకులపై జరుగుతున్న దాడులు, వేధింపులు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి ? ఇలా అనేక అంశాలపై చంద్రబాబు పార్టీ సీనియర్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు అమరావతి భూములపై టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయ కక్షతోనే తెలుగుదేశం పార్టీపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ కక్షతోనే తెలుగుదేశం పార్టీపై ఈ విధమైన చర్యలకు అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్నారని బాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.
దుర్మార్గ పాలనలో మంచి వాళ్ళు పడే కష్టాలు పడాల్సిందే అని చెప్పేందుకు ఏపీని ఉదాహరణ గా తీసుకోవాలని చంద్రబాబు ఆ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఘాటుగా వ్యాఖ్యానించారు.
దోపిడీకి ఇదే చివరి అవకాశం అన్నట్లుగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, వైసీపీ దుర్మార్గాల పై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని, రాష్ట్రంలో ఎస్సీ మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయిందని, అసలు ఎవరూ స్వేచ్ఛగా మాట్లాడే, తిరిగే పరిస్థితి లేదని, అసలు జీవించే హక్కును కూడా ఈ వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోంది అంటూ బాబు మండిపడ్డారు.ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర కీలకమని, అవినీతిని ఎండగట్టే బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, పోలీసులు కూడా ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని చూడడం తగదంటూ బాబు పార్టీ శ్రేణులతో మాట్లాడిన సందర్భంగా వ్యాఖ్యానించారు.
అసలు పోలీసులు పార్టీలకు అతీతంగా పనిచేయాలని సూచించారు.ప్రజల మత విశ్వాసాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని, భక్తుల మనోభావాలను గౌరవించడం ప్రభుత్వం బాధ్యత అని, ధార్మిక సంస్థలు ఆలయాలపై దాడులు చేయడం బాధాకరమని చంద్రబాబు మాట్లాడారు.ఇంకా వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, అనేక అంశాలను పార్టీ నేతలతో క్షుణ్ణంగా చర్చించారు.