నిరంతరం పార్టీ గురించి, పార్టీని మళ్లీ ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలనే విషయం పైనా, తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి వైసీపీని ఏ విధంగా ఇరుకున పెడదామా అనే విషయాలపైన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిరంతరం పని చేస్తూ ఉంటారు.ఏదో రకంగా పార్టీని మళ్లీ గట్టెక్కించాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే, తెలుగు తమ్ముళ్లు మాత్రం హ్యాండ్స్ అప్ అనే పరిస్థితికి వచ్చేస్తున్నారు.
ఏపీలో అధికార పార్టీ దూకుడు ఎక్కువగానే కనిపిస్తోంది.ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు మరింత ఉత్సాహాన్ని నింపాయి.
కానీ తెలుగుదేశం చాలాచోట్ల ఘోరంగా దెబ్బతింది .స్వయంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ వైసిపి పట్టు సాధించింది.దీంతో చంద్రబాబు ఆందోళనలో ఉన్నారు.ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన బాబు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తూ అక్కడ పట్టు చేజారిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎంపిటిసి, జెడ్పిటీసి,మున్సిపల్ ఎన్నికలలో ఏదో రకంగా బలం పుంజుకుని, అధికారపార్టీకి చుక్కలు చూపించాలని బాబు డిసైడ్ అవ్వగా, తమ్ముళ్లు మాత్రం ఉసూరుమంటున్న వ్యవహారం తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.రాష్ట్రంలో వివిధ మున్సిపల్ వార్డుల్లో గతంలోనే తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేసిన వాళ్ళు చాలామంది, ఇప్పుడు వైసీపీలో చేరిపోతుండడంతో ఏం చేయాలో తెలియని ఆందోళనలో చంద్రబాబు ఉన్నారు.
ముఖ్యంగా పశ్చిమ గోదావరి, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అనేక మంది మున్సిపల్ వార్డులకు గతంలోనే నామినేషన్ వేశారు.
అప్పట్లో పార్టీలో ఈ టికెట్ల పై పోటీ నెలకొంది.అప్పట్లో బి ఫారం తెచ్చుకున్న వారు నామినేషన్ వేశారు.ఇప్పుడు వారు పోటీకి విముఖత చూపించడం, వైసీపీలో చేరిపోతూ ఉండడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.
నామినేషన్ వేసి దాదాపు ఏడాది అవుతున్న నేపథ్యంలో, ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు వైసీపీలో చేరిపోయారు.మరికొంతమంది మరణించడం వంటి కారణాలతో, టిడిపికి పోటీ చేసే అభ్యర్థులే కరువయ్యారు.
పోనీ వారి స్థానాల్లో పార్టీ కి చెందిన వేరే వారికి అవకాశం ఇద్దామనుకున్నా, నామినేషన్ వేసే అవకాశం లేకపోవడం, చాలా చోట్ల టిడిపి పోటీ నుంచి తప్పుకునే పరిస్థితి నెలకొనడం ఇవన్నీ వైసీపీకి బాగా కలిసి వస్తున్నాయి.ఈ పరిణామాలన్నీ టిడిపి అధినేత చంద్రబాబు లో ఆందోళన పెంచుతున్నాయి.
ఒక పక్క పార్టీ కోసం ఈ వయస్సులోనూ తాను కష్టపడుతున్నా, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం లేకుండా చేస్తున్నారనే బాధలో బాబులో పెరిగిపోతోందట.