చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఇటీవల కాలంలో టీడీపీ కి ఎదురు గాలి వీచింది.కీలకమైన నాయకులు చాలామంది వైసీపీలో చేరిపోవడం తో పాటు, కొంత మంది పార్టీ నాయకులు కోవర్టుగా మారడంతో కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో టిడిపికి పరాజయం ఎదురైంది.
దీంతో 2024 ఎన్నికల్లో చంద్రబాబు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తే ఇబ్బందులు తప్పవని సంకేతాలు వెలువడ్డాయి.దీంతో ఆయన కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు చంద్రబాబు నడుం బిగించారు.
గత రెండు రోజులుగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు.
మూడో రోజూ ఈ నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకుల పై తన అసంతృప్తిని వెళ్లగక్కారు .గత 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు గా చలామణి అవుతూ , అధికారంలో ఉన్న సమయంలో హడావుడి చేసిన నేతలందరికీ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.కుప్పం నియోజకవర్గంలో 30 ఏళ్లుగా మీ మొహాలు చూస్తున్నానని, మీరు తప్ప ఇంకెవరు పార్టీలో ఎదగ లేదా అంటూ ప్రశ్నించారు.తప్పనిసరిగా కుప్పం నియోజకవర్గంలో సీనియర్ నాయకులను పక్కన పెట్టి ద్వితీయ శ్రేణి నాయకులను ప్రోత్సహించాలని చంద్రబాబు డిసైడయ్యారు.
అందుకే సీనియర్లను ఉద్దేశించి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.మిమ్మల్ని నమ్ముకుని తాను పరువు పోగొట్టుకున్న అంటూ అసహనం వ్యక్తం చేయడానికి కారణాలు ఇవేనట.అసలు కుప్పం నియోజకవర్గంలో ఈ పరిస్థితి తలెత్తడానికి వైసీపీ నుంచి వచ్చిన బెదిరింపులు మాత్రమే కాకుండా, సొంత పార్టీ నాయకులు తప్పులు కారణమనే విషయాన్ని చంద్రబాబు గుర్తించారు.అందుకే ఈ నియోజక వర్గంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇప్పుడు ఈ పర్యటనను ఉపయోగించుకుంటున్నట్టు గా కనిపిస్తున్నారు.
అందుకే కాస్త కటువుగానే పార్టీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని గుర్తించారు.