తెలుగుదేశం పార్టీ నిర్వహించిన డిజిటల్ మహానాడు ఆ పార్టీలో కాస్త ఊపు తెచ్చినట్టుగానే కనిపిస్తోంది.కొంతమంది నాయకుల ఆశలకు చిగురు తొడిగినట్టు అయ్యింది.
ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్ష పదవిలో ఉన్న కిమిడి కళా వెంకట్రావు ను తప్పించి ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని చాలాకాలంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.కానీ ఎప్పటికప్పుడు సమయం అనుకూలించకపోవడంతో ఆ నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది.
మహానాడు సక్సెస్ అవ్వడం తో కాస్త ఊపులో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏపీ టీడీపీ పగ్గాలు కొత్త నాయకుడికి అప్పగించాలని చూస్తోంది.దీనిలో భాగంగానే బీసీ సామాజికవర్గం వైపే చంద్రబాబు మొగ్గు చూపిస్తున్నారు.
వారికే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.
ఇప్పటికే 2015 అక్టోబర్ నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉంటున్న కిమిడి కళా వెంకట్రావు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.అయినా మరోసారి బీసీలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు చూస్తున్నారు.తాను రాయలసీమకు చెందిన వ్యక్తి కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వ్యక్తిని మరోసారి ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమిస్తే అక్కడ పార్టీ బలం పుంజుకుంటుంది అనేది ఆయన భావన.
కళా వెంకట్రావు అంత చురుగ్గా లేకపోవడం కారణంగా అక్కడ పార్టీ పుంజుకోలేకపోయింది అనేది చంద్రబాబు అభిప్రాయమాట.ఈ క్రమంలో టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేరు ప్రస్తావనకు వస్తోంది.
ఎప్పటికప్పుడు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.
ఈ క్రమంలో అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్లు తెర మీదకు వస్తున్నాయి.వీరిద్దరూ టీడీపీ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు.అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు.అలాగే ఎన్టీఆర్ చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు.
ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఒకరికి అధ్యక్ష పీఠం అప్పగిస్తే ఏపీలో టీడీపీ మరింత బలం పుంజుకుంటుందని చంద్రబాబు ఆలోచన.
దీనికి సంబంధించి త్వరలోనే చంద్రబాబు నుంచి నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.