రాజకీయ ప్రత్యర్థులను ఊహించని విధంగా దెబ్బకొట్టి పై చేయీ సాధించేందుకు జగన్ వేసే ఎత్తుగడలు ఒకపట్టాన ఎవరికీ అర్థం కావు.ఇప్పటికే రోజురోజుకు బలహీన పడుతూ, ఉనికి కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీలో మరింత ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆన్లైన్ ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నా, నాయకులు మాత్రం ఎక్కడా ఉత్సాహం కనిపించకపోగా, భవిష్యత్తుపై బెంగ ఎక్కువైంది.అధికార పార్టీ తమను టార్గెట్ చేసుకుంటూ, ముందుకు వెళ్తుందన్న భయంతో చాలా మంది టీడీపీ కీలక నాయకులు ఇప్పుడు వైసీపీ బాట పట్టేందుకు సిద్ధమయ్యారు.
అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు చలమలశెట్టి సునీల్ వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.కాపు సామాజిక వర్గానికి చెందిన సునీల్ సామాజికంగానూ, ఆర్థికంగానూ బలమైన నాయకుడిగా ఉన్నారు.
గతంలో ప్రజారాజ్యం , ఆ తర్వాత వైసిపి, అక్కడ నుంచి టీడీపీ లోకి ఇలా అన్ని పార్టీల నుంచి ఆయన ఎన్నికల్లో పోటీచేసినా ఓటమే పలకరించింది.పూర్తిగా రాజకీయ వైరాగ్యంలో ఆయన ఉండిపోవడంతో రాజకీయంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ తరుణంలో వైసీపీ నుంచి ఆయనకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అలాగే జగన్ సైతం ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తామని హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీని వెనుక జగన్ వ్యూహం, ఎత్తుగడలు కూడా కనిపిస్తున్నాయి.తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతానికి చెందిన సునీల్ మూడు సార్లు మూడు పార్టీల నుంచి ఎంపీగా పోటీ చేసిన ఓటమి చెందారు.2009లో ప్రజారాజ్యం, 2014 వైసీపీ, 2019లో టిడిపి నుంచి ఎంపీగా పోటీ చేసి సునీల్ ఓటమి చెందారు.ఎప్పటి నుంచో ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నా, తన ఆశ తీరకపోవడంతో, ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న సునీల్ కు వైసీపీ నుంచి ఆఫర్ రావడంతో ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇక సునీల్ కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించే విషయంలో జగన్ చాలా లెక్కలు వేసుకుంటున్నారు.తూర్పుగోదావరి జిల్లాలో బలమైన వర్గంగా ఉన్న కాపులను దగ్గర చేసుకునేందుకు సునీల్ ద్వారా అవకాశం ఏర్పడుతుందని, అలాగే ఇప్పుడిప్పుడే బలపడుతున్న జనసేనకు సైతం ఇది ఇబ్బంది కలిగిస్తుందనే లెక్కలు వేసుకుంటున్నారు.2022 లో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాల్లో ఒకటి సునీల్ కు కేటాయిస్తానని జగన్ సైతం హామీ ఇవ్వడంతో, ఈయన చేరిక అనివార్యమైందట.
ఈ పరిణామాలు జనసేనకు ఆందోళన కలిగిస్తున్నాయి.సునీల్ ను జనసేనలోకి తీసుకువచ్చి తూర్పుగోదావరి జిల్లాలో బలపడాలని చూస్తున్న తరుణంలో, జగన్్ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారని, ఇదంతాా తమను దృష్టిలో పెట్టుకునే సునీల్ ను వైసీపీలో చేర్చుకుంటుందని అనుమానం వ్యక్తం చేస్తోంది.కానీ జగన్ కు ఉన్న లెక్కలు జగన్ కు ఉన్నాయి.