ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం అన్ని రాజకీయ పార్టీలను ముప్పుతిప్పలు పెడుతోంది.రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను కలుపుకుంటూ అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణపై జగన్ మొగ్గు చూపించడమే కాకుండా అసెంబ్లీలో ఈ బిల్లుపై ఆమోదం పొందేలా చేసి జగన్ తన పంతం నెగ్గించుకున్నారు.
అయితే శాసన మండలికి వచ్చేసరికి జగన్ ప్లాన్ కాస్త రివర్స్ అయింది.మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు కు సంబంధించి బిల్లును శాసనమండలి చైర్మన్ షరీఫ్ తన విచక్షణాధికారాలు ఉపయోగించి సెలెక్ట్ కమిటీకి పంపించారు.
దీనికోసం ఆయన రూల్ నెంబర్ 71 ఉపయోగించారు.దీనిపై ఇప్పుడు ఎక్కడ లేని రాద్ధాంతం జరుగుతోంది.
రూల్ నెంబర్ 71 దేశంలో ఎక్కడా లేదని, నిబంధనలకు విరుద్ధంగా శాసనమండలి చైర్మన్ వ్యవహరించారని అధికార పార్టీ సభ్యులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శాసనమండలి గ్యాలరీ లో కూర్చుని మరి చైర్మన్ షరీఫ్ ను ప్రభావితం చేశారని విమర్శలు కూడా వచ్చాయి.శాసనసభలో ఆమోదం పొందిన బిల్లు శాసన మండలికి వచ్చాక దానిపై సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తి ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని ప్రతిపాదించినప్పుడు మాత్రమే చైర్మన్ దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, శాసనమండలి చైర్మన్ మాత్రం ఆవిధంగా చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు.
ఆ తరువాత వెంటనే సభను వాయిదా వేశారు.చైర్మన్ చర్యలపై రాజకీయంగా, వ్యక్తిగతంగా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
అందుకే శాసనమండలి చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో పాటు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచనకు వచ్చారట.ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఫోన్ చేసి చెప్పడంతో ఆయన కంగారు పడవద్దని ఆయనకు నచ్చజెప్పారట.కానీ ఈ సారి మాత్రం తన చర్యలతో రాజకీయంగా మాయని మచ్చ ఏర్పడిందని ఇప్పటి వరకు తనకు ఉన్న పేరు కాస్త ఈ చర్యలతో దూరమయ్యిందనే బాధలో ఉన్నట్లు తెలుస్తోంది.అందుకే రాజీనామాపై ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.