భారత్, చైనా సరిహద్దులో ఇంకా ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.గల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల సైనికులు భారీగా మోహరించారని పేర్కొన్నారు.1962 తర్వాత ఈ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఇదే తొలిసారని అభిప్రాయపడ్డారు.కొన్ని దశాబ్దాల తర్వాత సరిహద్దులో మన సైనికులను కోల్పోయామని అన్నారు.
ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని వివరించారు.ఈ పరిస్థితిని యధాతథ స్థితికి తెచ్చేందుకు భారత్ మిలిటరీ చర్యలతో పాటు దౌత్య పరంగా కృషి చేస్తోందని వెల్లడించారు.
డ్రాగన్ దేశం సామరస్యంగా వ్యవహరిస్తే పరిస్థితి సద్దుమనుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇరు దేశాల సైనికాధికారుల నడుమ పలుమార్లు సమావేశాలు జరిగినా ఫలితం లేకపోయిందని జైశంకర్ తెలిపారు.
గతంలో జరిగిన చూమర్, డోక్లాం వంటి వివాదాలను దౌత్యపరంగానే పరిష్కరించినట్లు పేర్కొన్నారు.కానీ ప్రస్తుతం దానికి విరుద్ధ పరిస్థితులేర్పడ్డాయని తెలిపారు.త్వరలోనే దౌత్యపరంగా పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇరు దేశాలు సామరస్యంగా ఒప్పందాలు కుదుర్చకొని, వాటిని గౌరవిస్తేనే ఇది సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు.