తెలంగాణలోని హుజూర్ నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి అక్కడ పోటీలోకి దిగుతున్న పార్టీల్లో ఒకటే టెన్షన్ మొదలైంది.ఇక్కడ గెలవడం ప్రతిష్టాత్మకం కావడంతో కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి పార్టీలు మొత్తం దృష్టాంత ఇక్కడే కేంద్రీకరించాయి.
ముఖ్యంగా అధికార పార్టీ గా ఉన్న టిఆర్ఎస్ పార్టీకి ఇక్కడ గెలుపు అత్యవసరం.అందుకే స్థానికంగా బలంగా ఉన్న సీపీఐతో పొత్తు పెట్టుకుంది.
ఇక సిపిఎం కూడా పరోక్షంగా అధికారపార్టీకి మద్దతు ఇస్తోంది.అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో వామపక్ష పార్టీలు టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే విషయంలో వెనకా ముందు ఆడుతున్నాయి.
ఉప ఎన్నికల్లో సిపిఐ టీఆరఎస్ కు మద్దతు పలికిన సమయంలో ఆర్టీసీ సమ్మె లేకపోవడం, ఆ తర్వాత ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలు పెట్టడం ఆ సమ్మె పై కెసిఆర్ నియంతృత్వ ధోరణితో ముందుకు వెళ్లడం ఇవన్నీ సిపిఐ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.
మరీ ముఖ్యంగా చెప్పుకుంటే ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుండి తొలగిస్తూ ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై సిపిఐ గుర్రుగా ఉంది.కెసిఆర్ తన నిర్ణయాలు మార్చుకుని కార్మికుల విషయంలో సానుకూలమైన నా నిర్ణయం తీసుకోకపోతే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే విషయంలో తాము పునరాలోచన చేస్తామంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ప్రకటించడం టిఆర్ఎస్ ను ఆందోళనకు గురి చేస్తోంది.బుధవారం హైదరాబాదులో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అఖిల పక్ష పార్టీలు, కార్మిక సంఘాలు అన్ని ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలికాయి.
ఈనెల 19న తెలంగాణ బందుకు పిలుపును ఇవ్వాలని ఆ సమావేశంలో నిర్ణయం సిపిఐ మీద మరింత ఒత్తిడి పెంచింది.ఈ పరిస్థితుల్లోనే సమ్మెపై కెసిఆర్ మెట్టు దిగకపోతే మద్దతు ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గేందుకు కూడా వెనకాడకూడదనే ఆలోచనలో ఆ పార్టీ ఉంది.దీనిపై ఇప్పటికే టీఆర్ఎస్ లో అంతర్మధనం మొదలయ్యిందట.ఎన్నికల సమయంలో అనవసరంగా ఈ వివాదంలో చిక్కుకున్నామని, ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశాలను తమకు అనుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది.అవసరమైతే సీపీఐ నాయకులతో మరోసారి చర్చలు జరిపి వారి మద్దతు కూడగట్టాలని ఆలోచనలో కాంగ్రెస్ ఉంది.