ఎన్నో సంచలన పథకాలను ఏపీలో ప్రవేశపెడుతూ కరోనా కష్ట కాలంలో ఎక్కడ ఏ పథకానికి ఆటంకం కలగకుండా, అన్ని రకాల చర్యలు తీసుకుంటూ జగన్ అందరివాడు గా గుర్తింపు పొందారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, మడమ తిప్పని నేతగా మంచి మార్కులే కొట్టేశారు.
ఇక జగన్ తండ్రి దివంగత నేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం ఇప్పటికీ వైయస్ పేరు మారుమోగే విధంగా చేస్తోంది.ఆ ప్రభావం జగన్ పైనా కనిపిస్తోంది.
తండ్రి మాదిరిగానే జగన్ సైతం రైతు పక్షపాతి, పేదల పెన్నిధి అంటూ ప్రచారం జరుగుతూ వస్తోంది.అంతగా ప్రతిష్ట తీసుకువచ్చిన ఉచిత విద్యుత్ పథకానికి ఏపీలో మంగళం పాడే రోజులు అతి సమీపంలోనే ఉన్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
ఈమేరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.అసలు ఇంత అకస్మాత్తుగా ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేయాలని నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయట.
ఇప్పటికే ఏపీ తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయింది.పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలుతో పాటు, రాష్ట్ర ఖజానాకు ఆదాయం కూడా అంతంత మాత్రంగా ఉండడం, జీతాలు, పెన్షన్లు కి సొమ్ములు భారీగా ఖర్చయిపోతుండడం, ఆదాయం వచ్చే మార్గం సన్నగిల్లడం వంటి కారణాలతో ఏపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఈ పరిస్థితుల్లో రాష్ట్రం అప్పులు తీసుకునే లిమిట్ కూడా దాటిపోవడంతో, ఇకపై అప్పులు చేయాలంటే తప్పనిసరిగా కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాల్సిందే.అలా తీసుకోవాలంటే కేంద్రం విధించిన నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి 5 శాతానికి పెంచుకోవాలంటే కేంద్రం పెట్టిన షరతుల్లో భాగమైన ఉచిత విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఎఫ్ఆర్బిఎం పరిమితిని 5 శాతానికి పెంచుతూ ప్రత్యేకంగా ఓ ఆర్డినెన్స్ ను ఏపీ ప్రభుత్వం త్వరలోనే తీసుకురాబోతోందట.
దీనికి కేంద్రం ఓకే చెప్పాలంటే ఉచిత విద్యుత్ ను ఎత్తివేస్తూ తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.అలా తీసుకుంటేనే కేంద్రం కొత్త అప్పులు చేసేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉండడంతో, ఉచిత విద్యుత్ కు మంగళం పాడాలని ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు గా ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వం ఉచిత విద్యుత్తుకు మంగళం పాడినా, ఆ సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని చెప్పి, రైతులు ఆగ్రహానికి గురికాకుండా, ఏపీ ప్రభుత్వం తప్పించుకునే అవకాశం కూడా కనిపిస్తోంది.
అంటే బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదా రైతులు ఆ బిల్లులను చెల్లిస్తే, తిరిగి ఆ సొమ్ములను వారి బ్యాంక్ అకౌంట్ లో ఆ సొమ్మును వేసే విధంగా చేయడమో చేయాల్సి ఉంటుంది.
అలా కాకుండా రైతులకు ఊరట ఇచ్చే విధంగా ఏ నిర్ణయం తీసుకోకపోతే, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకోవలసి ఉంటుంది.