కోవిడ్-19 కారణంగా గత ఆరు నెలలుగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ పేరిట విమానాలను నడుపుతుందన్న విషయం విధితమే.ఇప్పటికే ఈ మిషన్ ద్వారా 11,82,129 మంది ప్రయాణికులు స్వదేశానికి రాగలిగారు.
ఐతే స్వదేశానికి తిరిగొచ్చే ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన శాఖ తాజాగా కొన్ని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.అవేంటో ఒక్కసారి చూద్దాం.
ప్రయాణికులు వందేమాతరం మిషన్ కి అర్హులైన వారిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముందుగానే నిర్ణయిస్తుంది.స్వదేశీ ప్రయాణానికి అర్హులైన వర్గానికి చెందినవారి జాబితాను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తమ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరుచుతుంది.
ప్రయాణానికి అర్హులైన వారు భారత పౌర విమానయాన శాఖ అనుమతించిన నాన్ – షెడ్యూల్ విమానాల్లో మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది.ప్రయాణ ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
విమానం ఎక్కే ముందు ప్రతి ఒక్క ప్రయాణికుడు థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.కరోనా లక్షణాలు ఉన్న వారు ప్రయాణించడానికి అనుమతి లేదు.
విమానంలో ప్రయాణిస్తున్నంతసేపు ప్రతి ఒక్క ప్రయాణికుడు మాస్కు తప్పకుండా ధరించాలి.అలాగే చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.ప్రయాణికులందరూ తమ ప్రయాణానికి తామే బాధ్యులమని ఓ హామీ పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే సమర్పించాల్సి ఉంటుంది.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం ప్రయాణికులు క్వారంటైన్ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.