ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని, ఆ మేరకు కసరత్తు జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతూ వచ్చింది.ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదంతో బీజేపీ మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది.
కేంద్రం లెక్కల ప్రకారం 2023 లోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది.అయితే దీనిపై ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన ఏది కేంద్రం చేయకపోయినా, ఆ దిశగా మాత్రం ప్రయత్నాలు ఆపలేదు అనే విషయం ఇప్పుడు తెలుస్తోంది.
కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా చర్చ ఎక్కువైంది.వన్ ఇండియా వన్ నేషన్ ముందుకు తీసుకెళ్లే అంశంలో భాగంగా ఈ జమిలి ఎన్నికలపై ప్రచారం మొదలైంది.
తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు జమిలి ఎన్నికల అంశంపై చర్చించారు.అసలు జమిలి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది స్పష్టంగా తెలియకపోయినా, జరగబోయేది జమిలి ఎన్నికలే అని తెలుస్తోంది.
ఈ మేరకు కేంద్రం సీరియస్ గా ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తోందని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెబుతున్నారు.దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే కేంద్రంపై ఆర్థిక భారం తగ్గుతుందని, తరచుగా ఎన్నికలు జరుగుతుండడం వల్ల పెద్ద ఎత్తున సొమ్ములు ఖర్చు అవుతున్నాయని, అందుకే వివిధ రాజ్యాంగ సంస్థల సిఫార్సుల ఆధారంగా జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు కేంద్రం ఆలోచిస్తున్నట్లు కిరణ్ రిజుజు తెలిపారు.
లోక్ సభలో ఎంపీ ప్రదీప్ కుమార్ సింగ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రిజిజు ఈ సమాధానం చెప్పారు.దేశవ్యాప్తంగా 2014 – 19 మధ్య జరిగిన ఎన్నికల కోసం 5814 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు కేంద్రం పార్లమెంట్ లో వెల్లడించింది.లోక్ సభ తో పాటే, ఈ ఎన్నికలన్నీ జరిగి ఉంటే ఇంతగా ఖర్చు అయ్యేది కాదు అని కేంద్రం అభిప్రాయపడుతోంది.జమిలి ఎన్నికల సంకేతాలు ఉండడంతోనే దేశవ్యాప్తంగా ఉన్న నకిలీ ఓట్లను తొలగించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది.
దీనిలో భాగంగానే ఓటర్ కార్డు తో ఆధార్ కార్డు లింక్ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్రం ప్రతిపాదనలు పంపింది.అయితే కేంద్రం ప్రతిపాదనపై విపక్షాలు మండిపడుతున్నాయి.