ఒక్కోసారి టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరి వాహనాలు కనిపిస్తాయి.ముఖ్యంగా సంక్రాంతి వంటి పండగల సమయంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే హైవేపై వాహనాలు ఇలానే క్యూలో ఉండిపోతాయి.
ఈ క్రమంలో పలు చోట్ల దేశవ్యాప్తంగా ఇదే సమస్య ఎదురవుతుండడంతో ఫాస్టాగ్ విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది.దాని కంటే మిన్నగా మరో కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టనుంది.
నేషనల్ హైవేలోని నెట్వర్క్లోని ఫిజికల్ టోల్ ప్లాజాలకు స్వస్తి పలికేందుకు తమ మంత్రిత్వ శాఖ రెండు సాంకేతికతలను పరిశీలిస్తోందని గడ్కరీ బుధవారం రాజ్యసభకు తెలిపారు.ఈ రెండు సాంకేతికతలు జీపీఎస్-ఆధారిత, ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) ఆధారిత టోలింగ్ సిస్టమ్లు అమలు చేయనున్నారు.
రాజ్యసభలో పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు.60 కి.మీ లోపల టోల్ ప్లాజాల సమస్యపై ప్రశ్నలకు బదులిచ్చారు.టోల్ ప్లాజాల వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోందని, పొడవైన క్యూలు వంటి అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని, వీటిని ప్రభుత్వం పరిష్కరించాలనుకున్నట్లు గడ్కరీ తెలిపారు.
ప్రభుత్వం ఇప్పుడు రెండు ఎంపికలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ ఇక్కడ జీపీఎస్ కారులో ఉంటుంది.టోల్ నేరుగా ప్రయాణీకుల బ్యాంక్ ఖాతా నుండి వసూలు చేయబడుతుంది.తాము ఉపగ్రహాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఫాస్ట్ట్యాగ్కు బదులుగా జీపీఎస్ని ప్రవేశపెట్టే ప్రక్రియలో ఉన్నట్లు గడ్కరీ చెప్పారు.
అధికారిక నిర్ణయం తీసుకోనప్పటికీ, నంబర్ ప్లేట్ టెక్నాలజీపై టోల్ ప్లాజా ఉండదని ఆయన పేర్కొన్నారు.అధునాతన కంప్యూటరైజ్డ్ డిజిటల్ సిస్టమ్ ఉంటుందని తెలిపారు.హైవేపై టోల్ ప్లాజాల వద్ద క్యూలు ఉండవని, ప్రజలు గొప్ప ఉపశమనం పొందుతారని మంత్రి తెలిపారు.అయితే దీని కోసం పార్లమెంటులో కొత్త బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఎందుకంటే ఎవరైనా టోల్ చెల్లించకపోతే, వారికి జరిమానా విధించే చట్టం ఇంకా అందుబాటులో లేదని వివరించారు.ఆరు నెలల్లో, దీన్ని పూర్తి చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.