రానున్న రోజుల్లో తమకు పోటీ కాబోతున్న నారా లోకేష్ వ్యవహారంపై వైసీపీ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది.లోకేష్ ప్రస్తుతం హైదరాబాద్ లోని తన ఇంటికి పరిమితం అయినా, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై తరచుగా విమర్శలు చేస్తూ, ఇబ్బంది కలిగిస్తున్నారు.
ఇవే కాకూండా అనేక అంశాలపై ప్రభుత్వానికి సవాళ్ళు విసురుతూ, నిలదీస్తూ హడావుడి చేస్తున్నారు.ఇప్పుడు కాకపోయినా మరికొద్ది రోజుల్లో అయినా, టీడీపీ పగ్గాలు పూర్తిగా లోకేష్ చేతికి రావడం ఖాయం.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అదేపనిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజల్లో ప్రభుత్వం పై ఉన్న మంచి పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ చాలాకాలంగా ఆగ్రహంగా ఉంది.
ఈ తరుణంలో గత టీడీపీ ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది.
ఇప్పటికే లోకేష్ నిర్వహించిన ఐటి శాఖ లోని కొన్ని అవకతవకలను గుర్తించింది.ముఖ్యంగా ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో, దీనిపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.
సుమారు రెండు వేల కోట్ల వరకు ఈ వ్యవహారంలో అవినీతి జరిగినట్లు మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది.ఇవే కాకుండా అనేక అంశాల్లో చంద్రబాబు లోకేష్ అవినీతికి పాల్పడినట్టుగా వైసీపీ కొన్ని ఆధారాలను సేకరించింది.
వీటిపై సిబిఐ విచారణ చేయించేందుకు నిర్ణయం తీసుకుని, ఈ మేరకు బీజేపీ ద్వారా సిబిఐకి లేఖ రాయించింది.కానీ అటువైపు నుంచి పెద్దగా స్పందన కనిపించకపోవడంతో , వైసీపీ ఎంపీలు పార్లమెంటు వద్ద సమావేశాలకు హాజరు కాకుండా, ఏపీలో తెలుగుదేశం పార్టీ అవినీతి వ్యవహారాలపై విచారణ చేయించాలని, సిబిఐకి అనుమతి ఇవ్వాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.
అయినా కేంద్రం ఈ వ్యవహారంలో తలదూర్చేందుకు ఇష్టపడనట్టుగా వ్యవహరిస్తోంది. ఏపీలో ఇప్పుడిప్పుడే వైసీపీ బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో పోరు జరుగుతున్న నేపథ్యంలో, వైసీపీ డిమాండ్లకు తలొగ్గి ఆ పార్టీ నిర్ణయానికి అనుకూలంగా వ్యవహరిస్తే, ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది అనే అభిప్రాయంతో బిజెపి ఉన్నట్లుగా కనిపిస్తోంది.
అందుకే లోకేష్ పై సిబిఐ విచారణ విషయంలో పెద్దగా స్పందించడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.కేంద్రం లో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు టీడీపీలో కాస్త ఆనందం కలిగిస్తున్నాయి.
లోకేష్ అవినీతి వ్యవహారాలకు సంబంధించి సిబిఐ విచారణ చేయించేందుకు కేంద్రం ఒప్పుకోకపోతే, లోకేష్ సేఫ్ గానే ఉంటారు.వైసీపీ కల్పిత ఆరోపణలు చేసి రాజకీయంగా పై చేయి సాధించాలని చూస్తోంది అంటూ ఆయన ప్రచారం చేసుకుంటారు.
ఇవన్నీ అంతిమంగా జగన్ కు ఇబ్బంది తెచ్చే పరిణామాలే.