కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో అంతర్రాష్ట ప్రయాణాలపై కేంద్రం నిషేధం విధిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా ఈ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు వద్దు అంటూ కేంద్ర ప్రభుత్వమే,రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది.తాజాగా ఆన్ లాక్ 3.0 మార్గదర్శకాల్లో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించనవసరం లేదని కేంద్ర హోంశాఖ మార్గదర్సకాలలో పేర్కొంది.అయితే కేంద్రం సూచించినప్పటికీ కూడా ఇంకా కొన్ని కొన్ని రాష్ట్రాలు ఈ అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తుండడం తో అది కాస్త కేంద్రం దృష్టికి రావడం తో తాజాగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మేరకు సూచనలు చేస్తూ స్పష్టం చేసింది.వ్యక్తులు,వస్తువుల రవాణా పై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు అని,ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్సులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ ద్వారా వెల్లడించినట్లు తెలుస్తుంది.
ఇలా అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు విధించడం తో సప్లయ్ చైన్,ఆర్ధిక కార్యకలాపాలు, ఉపాధిపై ప్రభావం పడుతుంది అని,ఎవరైనా ఆంక్షలు విధిస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుంది అని కేంద్రం స్పష్టం చేసింది.
అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ప్రత్యేక అనుమతులు కానీ,ఈ పర్మిట్లు కానీ అవసరం లేదు అంటూ ఆ లేఖ ద్వారా కేంద్రం స్పష్టం చేసింది.
అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు సైతం ఈ సూచనలను తప్పకుండా పాటించాలి అంటూ కేంద్రం సూచించింది.దీనితో ఇప్పుడు అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎవరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా కేంద్రం గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.