ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా లాక్ డౌన్ విధించడంతో పనులు, ఉద్యోగాలు, వలస కార్మికులు తదితరులు తమ సొంత గ్రామాలకు వెళ్లకుండా తాము ఉన్నటువంటి ప్రాంతాల్లోనే చిక్కుకుపోయారు.
దీంతో కొందరు ప్రస్తుతం తిండి దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అయితే లాక్ డౌన్ కారణంగా తమ స్వగ్రామాలకు వెళ్లలేకపోయిన వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తాజాగా భారతీయ జనతా పార్టీ మంత్రి మరియు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయం గురించి స్పందించారు.ఇందులో భాగంగా కూలీలు, వలస కార్మికులను తమ స్వగ్రామాలకు తరలించేందుకు గాను మూడు వందల రైళ్లను ప్రత్యేకంగా నడుపుతున్నట్లు తెలిపారు.
అంతేకాక ఈ రైళ్లలో ప్రయాణించే వారి టికెట్ ధర కేవలం 50 రూపాయలు మాత్రమే ఉంటుందని, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదా తాము పని చేస్తున్నటువంటి సంస్థ అధికారులు చెల్లించాల్సి ఉంటుందని సూచించారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో పనుల నిమిత్తం వచ్చి పట్టణాల్లో చిక్కుకుపోయినటువంటి కొందరు వలస కార్మికులు, కూలీలు, నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించాలంటే కరోనా నిర్ధారిత పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.అంతేకాక రైలు నుంచి దిగిన తర్వాత కూడా ప్రభుత్వ నిర్వహించేటువంటి స్క్రీనింగ్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే దగ్గర్లో ఉన్నటువంటి క్వారెంటైన్ భవనానికి తరలిస్తారు.అలాగే రైలులో ప్రయాణం చేసేటువంటి వారికి భోజన సదుపాయాలు కూడా రైళ్లలోనే ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
అలాగే గ్రీన్ జోన్లలో బస్సులు తిరిగేందుకు కూడా అనుమతులను జారీ చేసింది.