రాజీవ్ గాంధీ ఫౌండేషన్ పై కేంద్రం దృష్టి పెట్టింది.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫౌండేషన్ కు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి సహాయనిధి నుంచి భారీగా విరాళాలు మళ్లించారు అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు దానిపై దృష్టి పెట్టింది.
1991లో మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉన్న హయాంలో 5 ఏళ్ళ పాటు సంవత్సరానికి 20 కోట్ల చొప్పున మొత్తం 100 కోట్లను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి ఇస్తున్నట్టు ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో కూడా పేర్కొన్నట్లు నడ్డా వ్యాఖ్యానించారు.దీనితో గాంధీ కుటుంబం ఇరుకున పడినట్లు అయ్యింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, రాజీవ్ గాంధీ ఫౌండేషన్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ లపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.అసలు ఈ ట్రస్ట్ లకు ఎక్కడ నుంచి నిధులు సమకూరుతున్నాయి అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
అంతేకాకుండా ఈ ట్రస్ట్ లు ఆదాయపు పన్ను శాఖ నిబంధనలను, విదేశీ విరాళాలకు సంబంధించిన రూల్స్ ని ఉల్లంఘించాయని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతుండడం తో ఈ క్రమంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు దీనిపై విచారణ జరపనున్నట్లు సమాచారం. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ని 1991 లో రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ని 2002 లో ఏర్పాటు చేశారు.
ఈ రెండు ట్రస్టులను సోనియా గాంధీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ బోర్డులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సభ్యులుగా ఉన్నారు.
దీంతో ఈ వివాదం వారికి కూడా చుట్టుకోనుంది.ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే.ఇప్పుడు తాజాగా రాజీవ్ ఫౌండేషన్ కు సంబంధించిన కేసు కూడా తలకు చుట్టుకొనే అవకాశం కనిపిస్తుంది.