ఏపీ తెలంగాణలో రాజకీయ పార్టీలతో పాటు, చాలా రాష్ట్రాల్లో ఉప ఎన్నికల విషయమై అన్ని రాజకీయ పార్టీలు ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి.కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తుందా అని అంతా ఎదురు చూస్తూ ఉండగా, కేంద్ర ఎన్నికల సంఘం నాయకుల ఆశలపై నీళ్లు చిమ్మింది.
ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం దీంతోపాటు అధికారుల నుంచి కరోనా వైరస్ ప్రభావం తదితర అంశాలపై ఎప్పటికప్పుడు రిపోర్టును తెప్పించుకుంటోంది.దీంతో ఈసీ నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది అందరికీ టెన్షన్ కలగిస్తూ ఉండగా, కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఉప ఎన్నికలపై ప్రకటన చేసింది.
ఇప్పట్లో ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ తేల్చిచెప్పడంతో, హుజురాబాద్ ఎన్నికల తో పాటు , ఏపీ లోని కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ ఎన్నికలు వాయిదా పడ్డాయి.కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించలేము అని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చేసింది.
ప్రస్తుతం వర్షాలు, వరదలు , కరోనా వైరస్ ప్రభావం, అలాగే పండుగ సెలవులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించవద్దని టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయడం తదితర కారణాలతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఉప ఎన్నికల నిర్వహణ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం అనేక రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించింది.
అంతేకాదు ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన వాతావరణం ఉందా లేదా అనే విషయాన్ని ప్రధాన కార్యదర్శి ద్వారా ఆరా తీసింది.దీంతోపాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, డీజీపీ ఇలా అందరి అభిప్రాయాలను తీసుకుంది.
చివరకు ఉప ఎన్నికల నిర్వహణను ఇప్పట్లో సాధ్యపడదు అంటూ తేల్చడంతో ఎప్పుడు దీనిపై నిర్ణయం వెలువడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.కాగా ఇప్పటికే హుజురాబాద్ లో ఎన్నికల తంతు మొదలై పోయినట్లు గా అన్ని రాజకీయ పార్టీలు హడావుడి చేస్తున్నాయి.
పాద యాత్రతో పాటు, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను పలకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈటెల రాజేందర్ పై సానుభూతి ఉందని, అది కొంతకాలం తరువాత ఉండదని టిఆర్ఎస్ మొదటి నుంచి అంచనా వేస్తోంది.అందుకే ఉప ఎన్నికలు ఎంత ఆలస్యమైతే అంతగా తమకు కలిసి వస్తుందనే ఆలోచనతో కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ పదేపదే విజ్ఞప్తి చేస్తూ, చివరకు సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది.
ఇక ఏపీలోనూ తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గం లో జరగబోయే ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ పేరు ని ప్రకటించింది.వైసీపీ కూడా దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ సుధకు టికెట్ కేటాయించే అంశంపై కసరత్తు చేస్తోంది.ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ విధమైన ప్రకటన చేయడంతో ఒక్కసారిగా అందరిలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది.