బీజేపీ ప్రభుత్వం హయాంలో బడ్జెట్ ఎవరు ప్రవేశ పెట్టిన అందులో ఏపీకి మాత్రం ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉంది.కేటాయింపుల విషయంలో ఏపీకి బీజేపీ పార్టీ మోసం చేస్తూ వస్తుంది.
విభజన చట్టంలో ఉన్న హామీలు అన్ని తుంగలో తొక్కిన బీజేపీ పార్టీ తరువాత ఎపీకి ప్రత్యేక హోదా అని కథలు చెప్పి అన్ని రాష్ట్రాలకి ఇచ్చినట్లే బడ్జెట్ కేటాయింపులు చేస్తూ వచ్చింది.కొత్తగా ఏపీకి అదనపు ప్రయోజనం చేకూర్చే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.
మరల తాజాగా ఏపీ కోడలు ఆర్ధిక మంత్రి సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ కూడా ఏపీకి మొండి చేయి చూపించారు.ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కాని, అమరావతి నిర్మాణంలో కేంద్ర సాయం గురించి కాని ఎక్కడా ప్రస్తావించలేదు.
పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ గా చెబుతూ కేంద్రమే నిర్మిస్తుందని అప్పట్లో చెప్పారు.అయితే ఇప్పటి వరకు పోలవరం నిర్మాణం వేగంగా పూర్తి చేసి అందించడానికి బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ఆర్ధిక చేయూత అందించలేదు.
ఎన్నికల సమయంలో ఏపీకి వచ్చిన మోడీ రాష్ట్ర అభివృద్ధికి తమ పార్టీ పెద్ద పీట వేస్తుందని చెప్పుకొచ్చారు.ఇక ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా బీజేపీతో లోపాయకారిగా పొత్తు కొనసాగిస్తుంది.
ఏపీకి బీజేపీ ప్రభుత్వం సాయం అందిస్తుంది అని ప్రజలకి చెబుతూ వస్తున్నారు.అయితే ఆ మధ్య ప్రత్యేక హోదా అనే అంశాన్ని పూర్తిగా మరిచిపోవాలని సలహా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ లో ఏపీకి ఎలాంటి ప్రత్యేక నిధులు కేటాయించకుండా ఏపీ మీద తమకి ఎలాంటి ప్రత్యేక సానుభూతి లేదని స్పష్టం చేసినట్లు అయ్యింది.
దీనిపై ఇప్పటికే ఏపీలో రాజకీయ నేతలు, పలువురు రాజకీయ విశ్లేషకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.అయితే ఎన్ని విమర్శలు చేసిన ఇప్పుడు బీజేపీ నుంచి ఎంత సాయం ఆశించిన ప్రయోజనం ఉండదనేది మరోసారి స్పష్టం అయ్యింది.