భారతదేశంలో కోట్లాదిమంది అభాగ్యులకు ఆహార, వైద్య, విద్యా సేవలు అందించే మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థలకు ఊరట కలిగింది.ఈ సంస్థకు ఫారీన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీసీఆర్ఏ) కింద లైసెన్స్ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది.
దీంతో రెండు వారాలుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్లయ్యింది.
విదేశాల నుంచి విరాళాలను స్వీకరించేందుకు మిషనరీస్ ఆఫ్ చారిటీకి ఉన్న లైసెన్స్ గడువు ఇటీవల ముగిసింది.
రెన్యూవల్కు దరఖాస్తు చేసుకోగా, కొన్ని లోపాలను కేంద్ర హోంశాఖ గుర్తించింది.దీంతో వాటిని సరిదిద్ది, నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తూ కోల్ కతా కేంద్రంగా పనిచేసే మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థల బ్యాంక్ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం సీజ్ చేసింది.
దీనిపై దేశవ్యాప్తంగా పెను దుమారం రేగింది.సరిగ్గా క్రిస్మస్ పండుగ నాడే బ్యాంక్ ఖాతాలు స్తంభించిపోవడంతో వేల మంది పేదలకు అందే సేవల్లో అంతరాయం ఏర్పడింది.
కాగా.మదర్ థెరెస్సా చారిటీస్ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ ను కేంద్రం రెన్యూవల్ చేయకపోవడం పట్ల కేఏ పాల్ ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.ఉద్దేశపూర్వకంగానే లైసెన్స్ పునరుద్ధరణను నిరాకరించారని ఆయన పిటిషన్ లో ఆరోపించారు.ఈ నిర్ణయం స్వచ్ఛంద సేవాసంస్థల కార్యకలాపాలపై పెను ప్రభావం చూపుతుందని కేఏ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
అటు ప్రతిపక్షాలు, ఇతర సామాజిక సంస్థల నుంచి అభ్యంతరాలు, విమర్శలు రావడంతో కేంద్రం దిగివచ్చింది.మిషనరీస్ ఆఫ్ చారిటీ తాజా దరఖాస్తుతో లైసెన్స్ను పునరుద్ధరించినట్టు కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటించింది.
దేశంలో ఇటీవల దాదాపు 6 వేల స్వచ్చంధ సంస్థలు (ఎన్జీవోలు) విదేశీ విరాళాల లైసెన్సును కోల్పోయిన సంగతి తెలిసిందే.ఇందులో ఐఐటీ ఢీల్లీ, జమియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, మిషనరీస్ ఆఫ్ చారిటీ వంటి ప్రఖ్యాత సంస్థలు వున్నాయి.దేశంలో 2021, డిసెంబర్ 31 నాటికి 22,762 ఎఫ్సీఆర్ఏ నమోదిత ఎన్జీవోలు ఉన్నాయి.వీటిలో కొన్ని సంస్థలు లైసెన్సు కోసం తిరిగి దరఖాస్తు చేసుకోలేదు.దరఖాస్తు చేసుకోనివి, దరఖాస్తును కేంద్రం తిరస్కరించినవి కలిపి మొత్తం 5,933 ఎన్జీవోలు లైసెన్సును కోల్పోయినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.వీటితో కలిపి గత ఏడాది మొత్తంగా 12 వేలకు పైగా ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాలు పొందే లైసెన్సును కోల్పోయాయి.
కేంద్రం నిర్ణయంతో 2022, జనవరి 1 నాటికి విదేశీ విరాళాల లైసెన్సు కలిగిన సంస్థలు 16,829 మాత్రమే వున్నాయి.