ఈరోజుల్లో పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ అందరూ వాట్సాప్ కు అలవాటు పడ్డారు.నిత్యం చాటింగులు, వీడియో కాల్స్, స్టేటస్ అంటూ వాట్సాప్ తో కాలక్షేపం చేస్తున్నారు.
ఇటువంటి వాట్సాప్ తన యూజర్ల భద్రత కోసం కొత్త కొత్త ఫీచర్లను తెస్తోంది.ప్రైవసీ విషయంలో వాట్సాప్ ఈ మధ్యనే యూజర్లకు ఓ రూల్ తీసుకొచ్చింది.
ఈ విషయంలో వాట్సాప్కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.వాట్సాప్ తాజాగా తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీను ఉపసంహరించుకోవాలని కేంద్రం కోరింది.
దీనిపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని వాట్సాప్కు నోటీసులు జారీ చేసింది.ఇందులో విఫలమైతే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
కొత్త గోప్యతా విధానం అమలును వాయిదా వేయడం ద్వారా అంతర్జాతీయ యూజర్ల గోప్యతా విధానం, భద్రతా నిబందనల విషయంలో తప్పించుకోలేరని వాట్సాప్కు పంపిన నోటీసుల్లో కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వశాఖ పేర్కొంది.వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త గోప్యతా విధానం ద్వారా భారత్లోని పౌరుల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదముందని తెలిపింది.
సమాచార గోప్యత, డేటా భద్రత, యూజర్ల ఎంపికలకు ఈ విధానం వ్యతిరేకంగా ఉందని ఈ నోటీసుల్లో కేంద్రం వెల్లడించింది.
వాట్సాప్కు పంపిన నోటీసుల్లో ఈ కొత్త ప్రైవసీ పాలసీ భారత యూజర్ల హక్కులకు ఎలా భంగం కలిగిస్తుందో స్పష్టంగా వివరించింది.
దేశంలో ప్రజల హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే మీకు ఏడు రోజుల గడువిస్తున్నామని, సరైన సమాధానం రాకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని వాట్సాప్కు పంపిన నోటీసుల్లో కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.యూరప్ దేశాల యూజర్లతో పోలిస్తే డేటా పంచుకునేందుకు నిరాకరించిన భారతీయ యూజర్లపై ఈ కొత్త విధానం వివక్ష చూపేలా ఉందని కేంద్రం చెబుతోంది.
అందుకే దీన్నిఉపసంహరించుకోవాలని ఇప్పటికే కోరింది.వాట్సాప్ యూజర్లు కూడా చాలా మంది ఈ కొత్త విధానం వద్దంటూ నినాదాలు చేస్తున్నారు.