యూరోపియన్ దేశం ఆస్ట్రియాతో భారత్ కీలక మొబిలిటీ ఒప్పందం కుదుర్చుకుంది.ఈ మేరకు సోమవారం ఆ దేశ రాజధాని వియన్నాలో జరిగిన కార్యక్రమంలో భారత్, ఆస్ట్రియా దేశాల విదేశాంగ మంత్రులు ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ… ఆస్ట్రియాలో నిపుణులుగా పనిచేయాలనుకునే భారతీయులకు వాటిని మరింత సులభతరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.గతంలో దీనికి సవాలక్ష నిబంధనలు వుండేవని జైశంకర్ అన్నారు.
భారతీయులు తమ ఆర్ధిక అవకాశాలను విస్తరించుకోవడంతో పాటు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అవసరాలను తీర్చుకోవడంలోనూ సహాయపడేందుకు ఇటీవల జర్మనీతో పాటు ఫ్రాన్స్, పోర్చుగల్, యూకే, డెన్మార్క్లతో భారత్ ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంది.
The Comprehensive Migration and Mobility Partnership Agreement ద్వారా భారతీయులు తమ ప్రతిభను, నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తుందని జైశంకర్ పేర్కొన్నారు.
తాజాగా ఆస్ట్రియాతో కుదుర్చుకున్న ‘‘రెడ్ వైట్ రెడ్ కార్డ్’’ , వర్కింగ్ హాలిడే ప్రోగ్రాం ఒప్పందాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు.దీని కింద విద్యార్ధులు ఆరు నెలల పాటు ఆస్ట్రియాలో పనిచేయొచ్చని జైశంకర్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ వివాదంపై జైశంకర్ స్పందిస్తూ.ఇది తేలికగా పరిష్కరించే పరిస్ధితి కాదన్నారు.
కానీ దీనిపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోందని, విభేదాలు పరిష్కరించబడాలని జైశంకర్ ఆకాంక్షించారు.
భారత ప్రధాని ఇరు దేశాల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన చెప్పారు.ఇంధనం, ఆహారం, ఎరువులపై రష్యా – ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోందని జైశంకర్ పేర్కొన్నారు.ఇకపోతే.
భారత్- పాక్ సరిహద్దు సమస్యపై విదేశాంగ మంత్రి మాట్లాడుతూ పాకిస్తాన్కు ఉగ్రవాద కేంద్రం అనే పదం చాలా చిన్నదని, తాను అంతకంటే కఠినమైన పదాన్ని వాడతానని అన్నారు.
ఆ దేశం భారత పార్లమెంట్పై, మా ముంబైపై దాడి చేసిందని జైశంకర్ గుర్తుచేశారు.పట్టపగలే అక్కడ టెర్రరిస్ట్ క్యాంప్లు, శిక్షణ, నిధుల సమీకరణ జరుగుతున్నా పాకిస్తాన్కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు.చైనాతో సంక్షోభంపైనా జైశంకర్ మాట్లాడుతూ… సరిహద్దుల్లో బలగాలను భారీ ఎత్తున మోహరించకూడదని ఒప్పందాలు వున్నా పొరుగుదేశం వాటిని పట్టించుకోవడం లేదన్నారు.
ఈ కారణంగా సైనిక ఉద్రిక్తత నెలకొంటోందని జైశంకర్ వ్యాఖ్యానించారు.