న్యూఢిల్లీ:
ప్రస్తుత కరోనా సమయంలో రాబోతున్న వినాయకచవితి, దసరా, దీపావళి మొదలైన పండుగల్లో ఉత్సాహంగా పాల్గొనాలనుకుంటున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.అయితే రోజురోజుకు తిరిగి కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇది థర్డ్ వేవ్కు సంకేతమని నిపుణులు చెబుతున్నారు.పలు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి.
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు సామూహిక వేడుకలకు హాజరు కావద్దని ప్రభుత్వం కోరింది.అయితే రెండు మోతాదుల కరోనా వ్యాక్సీన్ తీసుకున్న వారు అటువంటి వేడుకలలో జాగ్రత్తలు పాటిస్తూ పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది.
పండుగల దృష్ట్యా కరోనా మార్గదర్శకాలను పాటించడం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది.దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ఇంకా ముగియలేదని ప్రభుత్వం హెచ్చరించింది.అయితే పాజిటివ్ రేటు ఉపశమనం కలిగించే విషయమని ప్రభుత్వం వెల్లడించింది.దేశంలోని 39 జిల్లాల్లో ఆగస్టు 31తో ముగిసిన వారంలో కరోనా వ్యాప్తి రేటు 10 శాతానికి పైగా ఉండగా, 38 జిల్లాల్లో ఇది 5 నుంచి 10 శాతం మధ్య ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మీడియాకు తెలిపారు.
ఇదిలావుండగా దేశవ్యాప్తంగా ఈ నెలలో జరగనున్న వినాయచవితి నవరాత్రులకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.ప్రజలంతా కరోనా ప్రొటోకాల్ పాటించాలని ఉత్సవాల నిర్వాహకులు కోరుతున్నారు.