విదేశాలలో ఉన్న భారతీయులకు డ్రైవింగ్ లైసెన్స్ ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.భారత్ నుంచీ విదేశాలకు వెళ్ళిన భారతీయులు ఎంతో మంది తమ డ్రైవింగ్ లైసెన్స్ ల విషయంలో అక్కడి ప్రభుత్వాలతో ఇబ్బందులకు లోనవుతున్నారు.
అంతేకాదు కొందరి లైసెన్స్ లు రద్దు కావడంతో పాటు, భారీ రుసుములు కూడా కట్టాల్సి వస్తోంది…దాంతో ఎన్నారైలు కేంద్రానికి ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ చేసిన విజ్ఞప్తుల మేరకు కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.ఇంతకీ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంటంటే.
భారత్ లోని అన్ని రాష్ట్రాల నుంచీ ఎన్నారైలు విదేశాలకు వెళ్తుంటారు.కాబట్టి ఒకే రకమైన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ దేశ వ్యాప్తంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణ మంత్రిత్వశాఖ కీలక మార్గ దర్సకాలు అన్ని రాష్ట్రాలకు జారీ చేసింది.గతంలో అన్ని రాష్ట్రాలు ఒకే రకమైన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ లను జారీ చేసేవి కాదు అందులోనూ వారు జారీ చేస్తున్న లైసెన్స్ లలో ఎన్నో తప్పులు కూడా ఉన్నాయి.
లైసెన్స్ ల యొక్క సైజు, రంగు, ఇలా ఎన్నో వ్యత్యాసాలు ఉండటంతో విదేశాలలో భారతీయులు అక్కడి ప్రభుత్వాలచే సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించిన కేంద్రం.
జెనీవా కన్వెన్షన్ ప్రకారం దేశ వ్యాప్తంగా ఒకే రకమైన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని QR కోడ్ తో డ్రైవింగ్ లైసెన్స్ ను ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కు జత చేసే ప్రక్రియని ప్రారంభించింది.ఈ జనీవా కన్వెన్షన్ ఉద్దేశ్యం ఏంటంటే ఈ జనీవా MOU పై సంతకాలు చేసిన దేశాలు అన్నీ ఒకే రకమైన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కు కట్టుబడి ఉండాలి.
దాంతో ఒక దేశం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లను మరో దేశం అనుమతించి తీరాల్సిందే.దరఖాస్తు చేసుకునే వారు వారి ప్రాంతాలలో ఉండే RTO ఆఫీస్ లను సంప్రదిస్తే సరిపోతుంది.