అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే 80 వేలకు పైగా కేసులతో అగ్రరాజ్యం అగ్రస్థానంలో నిలిచింది.
రానున్న రోజుల్లో ఈ లిస్ట్ మరింత పెరిగిపోయి అమెరికాలో మరణ మృదంగం మోగిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ సంగతి పక్కనబెడితే… ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ ప్రఖ్యాత చెఫ్ ఫ్లాయిడ్ కార్డోజ్ కన్నుమూశారు.
మార్చి 18న ఆయనకు కరోనా సోకినట్లు నిర్థారణ కావడంతో గత కొన్ని రోజులుగా న్యూజెర్సీలోని మౌంటేన్సైడ్ మెడికల్ సెంటర్లో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు.
ముంబైలో పుట్టిన కార్డోజ్ తొలుత బయోకెమిస్ట్గా శిక్షణ పొందారు.
అనంతరం కిచెన్, వంట, ఆహారంపై ప్రయోగాలపై అభిరుచితో చెఫ్గా మారారు.భారతదేశంతో పాటు స్విట్జర్లాండ్లో శిక్షణ పొందిన ఫ్లాయిడ్ తదనంతర కాలంలో న్యూయార్క్ షిఫ్ట్ అయ్యారు.
ఆ తర్వాత టాప్ చెఫ్ మాస్టర్ టైటిల్ పొంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.బొంబే క్యాంటీన్, ఓ పెర్డో సహా ముంబైలోని రెండు రెస్టారెంట్లకు ఆయన సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల తన మూడో వెంచర్గా బొంబే స్వీట్ షాప్ కూడా ప్రారంభించి పలువురికి ఉపాధి సైతం కల్పిస్తున్నారు.
మార్చి 8 వరకు ముంబైలోనే ఉన్న కార్డోజ్ చివరిసారిగా ఈ నెల 18న సోషల్ మీడియాలో స్పందించారు.తాను మార్చిన 8న ట్రీట్మెంట్ కోసం అమెరికా వచ్చానని, అయితే కొద్దిగా జ్వరంగా ఉన్నట్లు అనిపించడంతో న్యూయార్క్లోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు ఫ్లాయిడ్ కార్డోజ్ చెప్పారు.అయితే అమెరికా వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో కార్డోజ్ పాజిటివ్ అని తేలింది.
ఆయన హఠాన్మరణం పట్ల మరో భారత సంతతి సెలబ్రిటీ చెఫ్ పద్మాలక్ష్మీ సంతాపం తెలిపారు.
‘‘ఫ్లాయిడ్ తన పాకశాస్త్ర నైపున్యంతో మనందరినీ గర్వపడేలా చేశారని… ముఖ్యంగా న్యూయార్క్ వాసులు ఆయన చేతి రుచికరమైన భోజనాన్ని ఎన్నడూ మరచిపోలేరని ఆవేదన వ్యక్తం చేశారు.
తన చిరునవ్వుతో చుట్టూ వున్న వారిని కార్డోజ్ సంతోషంగా ఉంచేవారని పద్మాలక్ష్మీ ట్వీట్ చేశారు.బాలీవుడ్ ప్రముఖులు సైతం కార్డోజ్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
క్యాన్సర్ చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లిన అలనాటి నటుడు రిషీ కపూర్… ఫ్లాయిడ్ చేతి వంటను గుర్తుచేసుకున్నారు.