సులభంగా డబ్బు సంపాదించేందుకు కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.మోసం ఇలా కూడా చేయొచ్చా అన్న రీతిలో రెచ్చిపోతున్నారు.
తాజాగా కంప్యూటర్లను అడ్డు పెట్టుకుని కొత్త రకం మోసానికి తెరదీశాడో అమెరికన్ పౌరుడు.అతనికి భారతదేశంలోని పలు కాల్ సెంటర్లు అండగా నిలిచాయి.
వివరాల్లోకి వెళితే.వయోవృద్ధులైన అమెరికన్ పౌరులను మోసం చేశారనే ఆరోపణలపై మన దేశంలోని ఢిల్లీ, గురుగ్రామ్, మెయిన్పురి, జైపూర్, నోయిడాల్లో వున్న కాల్ సెంటర్లపై సీబీఐ, అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ దాడులు నిర్వహించాయి.
ఈ మోసానికి ప్రధాన సూత్రధారి కాలిఫోర్నియాలోని గ్లె౦డల్ నివాసి మైఖేల్ బ్రియాన్ కాటర్. అతను వందలాది మంది వృద్ధ అమెరికన్ పౌరులను మోసం చేసినట్లు భావిస్తున్నారు.
ఇందులో ప్రమేయం ఉన్న ఐదు కంపెనీలపై సీబీఐ, న్యాయశాఖతో పాటు ఫ్లోరిడా కోర్టులో ఫిర్యాదు చేసింది.ప్రముఖ సంస్థల నుంచి వచ్చిన పాప్-అప్ సందేశం ఆధారంగా వినియోగదారులను సంప్రదిస్తారు.
మీ కంప్యూటర్లు వైరస్ బారినపడినట్లు చెబుతారు.ఆ తర్వాత టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని, అందులో పాల్గొన్న కాల్ సెంటర్స్ బాధితుల కంప్యూటర్లకు రిమోట్ యాక్సెస్ ఇవ్వాలని కోరుతాయి.
ఆ తర్వాత సమస్య పరిష్కారం కోసం వందల డాలర్లు చెల్లించి, కొత్త సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసేలా సిబ్బంది వారి వెంట పడుతారు.బ్రియాన్ ఇలా అనేక సంస్థల ద్వారా ఈ తరహా మోసాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయం మైక్రోసాఫ్ట్ ద్వారా ట్రాన్స్ నేషనల్ ఎల్డర్ ఫ్రాడ్ స్ట్రైక్ ఫోర్స్ దృష్టికి వచ్చింది.
అచ్చం ఇదే తరహా కుట్రకు పాల్పిడిన కంపెనీలపై సిటీ ఆఫ్ లండన్ పోలీస్, సీబీఐలు కొద్దిరోజుల క్రితం దాడులు చేసిన సంగతి తెలిసిందే.ఈ సంస్థలు కంప్యూటర్ సాఫ్ట్వేర్ సేవల పేరుతో మోసాలకు పాల్పడుతూ బ్రిటన్ పౌరులను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.పైన తెలిపిన విధంగానే ఈ సంస్థలు బాధితుల కంప్యూటర్లలో పాప్ అప్ సందేశాల ద్వారా మాల్వేర్ను చొప్పిస్తాయి.
ఆ తర్వాత బాధితులు తమ కంప్యూటర్లను బాగు చేయించుకోవడానికి హెల్ప్లైన్ నెంబర్లకు ఫోన్ చేయమని సూచించడంతో పాటు సర్వీసుకు గాను రుసుము వసూలు చేసేవారు.ఈ ఫీజును కేవలం ఆన్లైన్ లేదా ఫోన్ ద్వారా చెల్లించాలని షరతు పెట్టేవారు.
దీని ద్వారా వినియోగదారుల ఆర్ధిక లావాదేవీల సమాచారాన్ని తస్కరించేవారు.