ఏపీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది.విచారణలో భాగంగా కడప జిల్లాలోని పులివెందులలో వివేకానంద రెడ్డి ఇంటిని సీబీఐ అధికారుల బృందం పరిశీలించింది.
వివేకానంద హత్య జరిగిన ప్రదేశాలను సీబీఐ అధికారులు పరిశీలించారు.వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతతో పాటు వారి కుటుంబ సభ్యులను విచారించారు.
అనంతరం పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో కేసు రికార్డులను సీబీఐ అధికారులు పరిశీలించారు.
గతేడాది మార్చి 15వ తేదీ వివేకానంద రెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.
ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం మూడు సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరిపించారు.మొత్తం 1,300 మంది అనుమానితులను గుర్తించడంతో పాటు ముగ్గురికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించారు.
వైసీపీ ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తోన్న తీరుపై వివేకా కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించారు.సిట్ విచారణపై సునీత పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ.కేసును సీబీఐకు అప్పగించాలని కోరారు.
వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ మార్చి 11న ధర్మాసనం తీర్పు వెల్లడించింది.
నాలుగు నెలలు ఆలస్యంగా సీబీఐ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.విచారణలో భాగంగా కడప జిల్లా ఎస్పీ, సిట్ అధికారులను కలిసి వివరాలను తెలుసుకున్న సీబీఐ బృందం.
వివేకాను హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించింది.ఇప్పటికే స్థానిక పోలీసులు దర్యాప్తు చేసిన నేపథ్యంలో సీబీఐ వాటిని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
రానున్న రెండు రోజుల్లో కీలక అనుమానితులను సీబీఐ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.